ముంబై : ప్రియురాలి సంతోషం కోసం ఆమె భర్తపై దాడి చేశాడో యువకుడు. ఈ సంఘటన ముంబైలోని సమతా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబైకి చెందిన సచిన్ యాదవ్ అనే వ్యక్తికి ఓ యువతితో ప్రేమ వ్యవహారం నడిచింది. ఆమెకు పెళ్లయినప్పటికి వారి మధ్య సంబంధం కొనసాగింది. ఈ నేపథ్యంలో ప్రియురాలి భర్త ఆమెను హింసిస్తున్నాడని సచిన్కు తెలిసింది. దీంతో ఆగ్రహించిన అతడు ప్రియురాలి భర్తకు గుణపాఠం చెప్పాలని నిశ్చయించుకున్నాడు. శనివారం ప్రేయసి భర్త ఓ బర్త్డే పార్టీకి వెళ్లాడని తెలిసి అక్కడికి తమ్ముడు ఆకాశ్ యాదవ్, మిత్రుడు సాగర్ గుప్తలను వెంట బెట్టుకుని వెళ్లాడు. మాస్కులతో ఉన్న ఆ ముగ్గురూ అతడిపై దాడి చేసి రెండు చేతులు విరిచేశారు. అనంతరం తలపై గాయం చేసి అక్కడినుంచి పరారయ్యారు. (పక్కా పథకం ప్రకారమే మహేష్ హత్య)
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మాస్కులు ధరించినందున పార్టీకి వచ్చిన వారెవరూ నిందితులను గుర్తు పట్టలేకపోయారు. అయినప్పటికి బాధితుడి కుటుంబసభ్యులు, పొరిగింటి వారు ఇచ్చిన సమాచారంతో సచిన్, ఆకాశ్, సాగర్ గుప్తల పేర్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సచిన్,ఆకాశ్లను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. పరారీలో ఉన్న మూడో వ్యక్తి సాగర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.