అనుమానం.. భార్య ముక్కు కొరికేసిన భర్త..

11 Jul, 2021 17:03 IST|Sakshi
గీత

బెంగళూరు : మద్యం మత్తులో భార్య ముక్కు కొరికేశాడు ఓ తాగుబోతు భర్త. భార‍్య మీద ఉన్న అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన కర్ణాటకలోని ధారవాడ తాలూకాలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెళగావి జిల్లా దొడ్డవాడ గ్రామానికి చెందిన ఉమేశ్‌, గీత భార్యా భర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మద్యానికి బానిసైన ఉమేశ్‌ భార్యతో తరుచూ గొడవపడేవాడు. దీంతో గీత ధారవాడ తాలూకా, అమ్మినబావిలోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో భార్యపై అనుమానం పెంచుకున్న అతడు అత్తారింటికి వెళ్లాడు. గత ఆరు నెలలనుంచి అత్తారింట్లోనే ఉంటున్నాడు. అక్కడ కూడా ఇద్దరూ తరుచూ గొడవ పడేవారు. శనివారం కూడా ఇ‍ద్దరి మధ్యా గొడవ చోటుచేసుకుంది.

ఆ గొడవ తారాస్థాయికి చేరింది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఉమేశ్‌, భార్య గీత ముక్కును కొరికేశాడు. నొప్పి భరించలేక ఆమె కేకలు వేయటంతో పొరిగిళ్లవాళ్లు అక్కడికి వచ్చారు. దీంతో ఉమేశ్‌ అక్కడినుంచి పరారయ్యాడు. ముక్కునుంచి రక్తం కారుతున్న ఆమెను హుబ్లీలోని కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు ఉమేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు