మద్యం మత్తులో కార్మికుడి దారుణ హత్య

12 Mar, 2022 04:30 IST|Sakshi
మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

శంషాబాద్‌: మద్యం మత్తులో ఓ యువకుడు మరో వ్యక్తిని హత్య చేసిన ఘటన ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిలుకూరు గ్రామానికి చెందిన మల్లేష్‌ (25) ఆటో డ్రైవింగ్‌ చేస్తూ శంషాబాద్‌ పట్టణంలోని సిద్ధంతిలో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం కాటేదాన్‌ వైన్స్‌లో మద్యం సేవిస్తున్న సమయంలో గగన్‌పహాడ్‌ పరిశ్రమలో కార్మికుడిగా పని చేస్తున్న బిహార్‌కు చెందిన జబారత్‌ (29) పరిచయం కాగా ఇరువురు కలిసి మరోసారి మద్యం తాగేందుకు గగన్‌పహాడ్‌లోని అప్పా చెరువు సమీపంలోని శిథిల భవనం వద్దకు వచ్చారు.

మద్యం సేవించిన అనంతరం ఇరువురి మధ్య మాటా మాటా పెరిగి మల్లేష్‌ బండరాయితో జబారత్‌ తలపై మోదగా తీవ్రంగా గాయపడ్డ జబారత్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు ఆర్‌జీఐఏ పోలీస్‌సేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపి లొంగిపోయాడు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు