శ్మశానంలో పంచాయితీ.. బీరు బాటిల్‌ పగులగొట్టి బావ దారుణ హత్య

6 Jul, 2021 09:16 IST|Sakshi

మద్యం మత్తులో బీరు బాటిల్‌తో పొడిచి హత్య 

నెల్లూరు (క్రైమ్‌): మద్యం మత్తులో బావను బీర్‌ బాటిల్‌తో పొడిచి బావమరిది దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన సోమవారం బోడిగాడితోట శ్మశాన వాటిక వద్ద జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. సత్యనారాయణపురానికి చెందిన సునీల్‌ (33), మౌనిక దంపతులు. సునీల్‌ ఇంటీరియర్‌ డెకరేషన్‌ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మౌనిక సోదరుడు పవన్‌ బావ ఇంట్లోనే ఉంటూ బావతో పాటు పనులకు వెళ్లేవాడు. సునీల్‌ చెల్లెలు శైలజను కిసాన్‌నగర్‌కు చెందిన రాజాకు ఇచ్చి పెద్దలు వివాహం చేశారు. 

అయితే రాజా చెడు వ్యసనాలకు బానిసై భార్యను వేధిస్తుండటంతో ఆమె భర్తపై నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి శైలజ తన అన్న సునీల్‌ వద్దనే ఉంటోంది. ఈ క్రమంలో తన భార్యను కాపురానికి పంపాలని రాజా కొద్ది రోజులుగా బావ సునీల్‌పై ఒత్తిడి తెస్తున్నాడు. చెడు వ్యసనాలు మాని మంచిగా ఉంటానంటే శైలజను కాపురానికి పంపుతానని సునీల్‌ వాయిదా వేస్తూ వచ్చాడు. దీంతో రాజా పవన్‌ను కలిసి తన భార్యను కాపురానికి పంపేందుకు సహాయం చేయాలని కోరారు.

క్షణికావేశంలో హత్య  
కుటుంబంలో జరుగుతున్న గొడవలను మా ట్లాడి పరిష్కరించుకుందామని పవన్‌ తన బావ సునీల్‌ను సోమవారం బోడిగాడితోట శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. ఇంతలో రాజా మద్యం తీసుకుని వారున్న చోటుకు వచ్చాడు. ముగ్గురు కలిసి మద్యం తాగుతున్న క్రమంలో శైలజను భర్తతో పంపాలని పవన్‌ ఒత్తిడి తెచ్చాడు. వారి మధ్య మాటామాటా పెరిగింది. కోపోద్రిక్తుడైన పవన్‌ తాను తాగుతున్న బీర్‌ బాటిల్‌ను పగులగొట్టి క్షణికావేశంలో సునీల్‌ను విచక్షణా రహితంగా పొడిచాడు.

గాయపడిన సునీల్‌ను స్థానికులు చికిత్స నిమి త్తం నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.  సమాచారం అందుకున్న నవాబుపేట ఇన్‌స్పెక్టర్‌ టీవీ సుబ్బారావు, ఎస్సైలు హాస్పిటల్‌ వద్ద కు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పో స్టు మార్టం నిమిత్తం జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడు పవన్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.   

మరిన్ని వార్తలు