పావురాలు కొనడానికి వచ్చి...కత్తితో దాడి

10 Nov, 2022 08:42 IST|Sakshi

మాలూరు: పావురాలు కొనడానికి వచ్చిన వ్యక్తి ఒకే కుటుంబంలోని ఏడుగురిని కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచిన ఘటన కోలారు జిల్లా మాలూరు పట్టణంలోని పటాలమ్మ కాలనీలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. కాలనీలో నివాసం ఉంటున్న రాము, భార్య హేమావతి, నాగవేణి, రాజేశ్వరి, రూపా, నాగరాజ్,మరొకరు కత్తిపోట్లకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

రాత్రి ఎందుకు వచ్చావనడంతో   
వివరాలు.... నాగరాజ్‌ తమ్ముడు రాము పావురాల వ్యాపారం చేస్తున్నాడు. మంగళవారం రాత్రి పావురాలు ఖరీదు చేయడానికి ఇమ్రాన్‌ ఖాన్‌ అనే వ్యక్తి వచ్చాడు. అప్పటికే మద్యం తాగి ఉన్న ఇమ్రాన్‌ను చూసిన నాగరాజ్‌ రాత్రి సమయంలో  ఎందుకు వచ్చావని అడిగాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఇమ్రాన్‌ఖాన్‌ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఇంట్లో ఉన్న వారిపై దాడి చేసి ఏడుగురిని గాయపరిచాడు.

చుట్టుపక్కల వారు వచ్చి బాధితులను ఆస్పత్రిలో చేర్పించారు.  మాలూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుని ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేశారు. దాడి వెనుక పాత కక్షలు ఏవైనా ఉన్నాయా? అని విచారణ చేపట్టారు. ఈ దాడి ఘటన పట్టణంలో తీవ్ర కలకలం సృష్టించింది. 

(చదవండి: మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ పేరిట వికృత చేష్టలు.. రంగంలోకి పోలీసులు)

మరిన్ని వార్తలు