డ్యాన్సర్‌కు రూ.11.75 లక్షల టోకరా 

5 Mar, 2021 08:00 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, హైదరాబాద్‌: నగరానికి చెందిన మహిళా డ్యాన్సర్‌కు మాట్రిమోనియల్‌ సైట్‌ ద్వారా పరిచమైన సైబర్‌ నేరగాడు పెళ్లి పేరుతో ఎర వేసి రూ.11.75 లక్షలు స్వాహా చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టా రు. బంజారాహిల్స్‌కు చెందిన సదరు డ్యాన్సర్‌ షాదీ.కామ్‌లో తన ప్రొఫైల్‌ను అప్‌లోడ్‌ చేశారు. దీన్ని చూసి ఆకర్షితుడయ్యానంటూ సైబర్‌ నేరగా డు ఎన్‌ఆర్‌ఐగా పరిచయం చేసుకున్నాడు. తాను ప్రస్తుతం లండన్‌లో ఉంటూ బీఎండబ్ల్యూ కార్ల కంపెనీలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నానంటూ నమ్మబలికాడు. ఇలా వ్యక్తగత విషయాలు చర్చించుకున్న ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే తాను భారత్‌కు వచ్చి స్థిరపడతానంటూ సైబర్‌ నేరగాడు నమ్మబలికాడు.

ఓ రోజు హఠాత్తుగా ఆమెతో మన ప్రేమకు గుర్తుగా, నిన్ను ఆశ్చర్యపరిచేందుకు ఓ అద్భుతమైన బహుమతి పంపుతున్నానంటూ చెప్పాడు. బంగారు ఆభరణాలు, కొన్ని డాలర్లు, ల్యాప్‌టాప్‌ పార్శిల్‌ చేస్తున్నానని చెప్పిన అతగాడు వాటి ఫొటోలనూ వాట్సాప్‌లో షేర్‌ చేశాడు. ఇది జరిగిన రెండో రోజు ఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్‌ అధికారులుగా కొందరు డ్యాన్సర్‌కు ఫోన్‌ చేశారు. మీ పేరుతో పార్శీల్‌ వచ్చిందని చెప్పి క్లియర్‌ చేసేందుకు కొన్ని పన్నులు కట్టాలన్నారు. ఇలా వివిధ క్లియరెన్స్‌ల పేరుతో పలుదఫాలుగా రూ.11.75 లక్షలు వివిధ బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకున్నారు. ఎట్టకేలకు ఇదంతా మోసమని తెలుసుకున్న బాధితురాలు సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మరోపక్క ఓ ఛానల్‌లో న్యూస్‌ యాంకర్‌గా పనిచేస్తున్న యువతి తనపై సోషల్‌మీడియాలో జరుగుతున్న అసభ్య ప్రచారంపై ఫిర్యాదు చేశారు.  

రెడ్డీస్‌ ల్యాబ్‌ పేరుతో ఫేక్‌ వెబ్‌సైట్‌
సైబర్‌ నేరగాళ్లు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ సంస్థ మాదిరిగా ఓ వెబ్‌సైట్‌ సృష్టించారు. ఆ సంస్థ అధికారిక ఈ-మెయిల్‌లో ఒక అక్షరం మార్చి పొందుపరుస్తూ ఐడీ సృష్టించారు. వీటి ఆధారంగా ఓ బ్యాంకు ఖాతాను కూడా తెరిచారు. అలా అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలంటూ ఎర వేశారు. వారి నుంచి కొంత వసూలు చేసి నకిలీ నియామక పత్రాలు అందించారు. ఇటీవల కాలంలో 15 మంది యువకులు ఇలాంటి అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు పట్టుకుని ఆ సంస్థ కార్యాలయానికి వెళ్లారు. ఇలా విషయం తెలుసుకున్న డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ సెక్యూరిటీ అధికారి గురువారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.  

మరిన్ని వార్తలు