తమ్ముడి ఇంట్లో శుభకార్యం.. అన్న ఇంట్లో విషాదం

22 Jun, 2021 09:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హసన్‌పర్తి (వరంగల్‌): తమ్ముడి ఇంట్లో వైభవంగా శుభకార్యం జరుగుతుండగా, మరో వైపు అప్పుల బాధతో మానసిక వేదనకు గురై అన్న ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇది. దీంతో శుభకార్యానికి వచ్చిన బంధుమిత్రులు శోకసముద్రంలో మునిగారు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం... హసన్‌పర్తి మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన మాటెటి ప్రదీప్‌ అలియాస్‌ మారుతి(40) ఏడేళ్లుగా గ్రామంలో మారుతి ఫర్టిలైజర్స్‌ షాపు నిర్వహిస్తున్నాడు. ఏటా సీజన్‌లో రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు ఇచ్చి, పంట అమ్మాక రైతుల నుంచి డబ్బు తీసుకుంటాడు. ఇలా బకాయిలు పేరుకుపోవడంతో వ్యాపార నిమిత్తం తీసుకొచ్చిన అప్పులు పెరిగిపోయాయి.

ఈ మేరకు సోమవారం ఇదే గ్రామంలోని తమ్ముడి కృష్ణ ఇంట్లో జరిగిన పిల్లల చెవులు కుట్టించే కార్యానికి హాజరైన అనంతరం మారుతి ఇంటికి వచ్చి పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబీకులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా, మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాçప్తు చేస్తున్నట్లు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌రావు తెలిపారు. కాగా, ఏఓ అనురాధ, ఫర్టిలైజర్‌ షాపుల నిర్వాహకులు ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించారు.

చదవండి:  వివాహేతర సంబంధాన్ని నిలదీసిన భర్త.. దీంతో..

మరిన్ని వార్తలు