ప్రియుడితో కలిసి భర్తపై భార్య వేధింపులు

18 Mar, 2021 09:16 IST|Sakshi
రాజు (ఫైల్‌)

మనస్తాపంతో వరద కాలువలో దూకి భర్త ఆత్మహత్య 

సాక్షి, మల్యాల(చొప్పదండి): భార్య, ఆమె ప్రియుడి వేధింపులు తాళలేక భర్త వరద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మల్యాల మండలంలోని నూకపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై నాగరాజు కథనం ప్రకారం.. మల్యాలకు చెందిన అట్టపల్లి రాజు(30)కు గొల్లపల్లి మండలం బొంకూరు గ్రామానికి చెందిన రమ్యతో ఏడాది కిందట వివాహం జరిగింది. తర్వాత రమ్యకు తుంగూరుకు చెందిన రాజేందర్‌తో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు రాజుకు తెలిసింది. ఈ క్రమంలో రాజేందర్‌తో ఆమె చనువుగా ఉండటం చూసిన రాజు పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోలేదు. కొద్దిరోజుల కిందట రమ్య గర్భం దాల్చింది. తన ప్రియుడి వల్లే తాను గర్భం దాల్చానని చెప్పి, తల్లిగారింటికి వెళ్లి అబార్షన్‌ చేయించుకుంది.

‘నువ్వు బతికి ఉండటం వృథా, చచ్చిపో’ అంటూ రమ్యతోపాటు రాజేందర్‌ ఫోన్‌లో తరచూ రాజును మానసికంగా వేధించేవారు. దీంతో మనస్తాపం చెందిన అతను మంగళవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయి, నూకపల్లి శివారులోని వరద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా పోలీసులు వరద కాలువ వద్ద వెతకగా బైక్‌తోపాటు రాజు చెప్పులు కనిపించాయి. కాలువలో గాలించడంతో మృతదేహం లభ్యమైంది. తన కుమారుడి మృతికి కోడలు, ఆమె ప్రియుడే కారణమని మృతుడి తండ్రి నాగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

   

మరిన్ని వార్తలు