చచ్చిపోతానని చెప్పి..ప్రాణం తీసుకున్నాడు.. 

2 Jan, 2022 13:02 IST|Sakshi

శ్రీకాకుళం(హిరమండలం): చచ్చిపోతానని బంధువులకు ఫోన్‌లో చెప్పిన కొద్దిసేపటికే ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జలుమూరు మండలం పర్లాం మాకివలస గ్రామానికి చెందిన అల్లు చిట్టిబాబు(35) మూడు నెలలుగా హిరమండలం మేజర్‌ పంచాయితీలోని పాతహిరమండలంలో గృహాన్ని అద్దెకు తీసుకొని ఉంటూ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరి దంపతుల మధ్య కొద్ది నెలలుగా వివాదం ఉంది.

ఈ క్రమంలోనే రెండు రోజుల కిందట భార్య, పిల్లను కన్నవారి ఇంటికి పంపించేశాడు. ఆత్మహత్య చేసుకుంటున్నానని శుక్రవారం రాత్రి బంధువులకు ఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో ఆందోళన చెందిన వారు.. విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వారు శనివారం ఉదయం వెళ్లి చూడగా.. గదిలో ఉన్న ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయి ఉన్నాడు. స్థానిక ఎస్సై ఎం.మధుసూదనరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుని భార్య భారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు. 

చదవండి: (బెదిరించి లొంగదీసుకుని.. గిరిజన బాలికలపై లైంగిక దాడి..)

మరిన్ని వార్తలు