వివాహం చేసుకోవాలి.. లేదంటే చంపుతా

24 Apr, 2021 06:38 IST|Sakshi

సాక్షి, నాగోలు: నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ సృష్టించి యువతికి పెళ్లి చేసుకోకుంటే చంపేస్తానని  బెదిరింపులకు పాల్పడుతూ మెసేజ్‌లు చేస్తున్న వ్యక్తిని రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద  నుంచి ఒక మొబైల్‌ ఫోన్, 6 సిమ్‌ కార్ట్‌లను  స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండలం, వెల్లంకి గ్రామానికి చెందిన చపాల ప్రవీణ్‌(22) గ్రామంలో మగ్గం వర్క్‌ చేస్తుంటాడు. అదే గ్రామానికి చెందిన చేనేత కార్మికుడి ఇంట్లో ఉండే అమ్మమ్మ దగ్గర యువతి నివాసం ఉండేది. ప్రవీణ్‌తో యువతికి పరిచయం ఏర్పడింది. దీంతో అతను యువతిని ప్రేమిస్తున్నానని చెప్పాడు. అందుకు యువతి వ్యక్తిగత కారణాల వల్ల అతడి ప్రతిపాదనను తిరస్కరించింది.

తర్వాత ఆమె తన సొంత గ్రామానికి వెళ్లి పోయింది. అప్పటి నుంచి అతడిని నిర్లక్ష్యం చేయడంతో ఆమెపై పగ పెంచుకున్నాడు. ఆమె వద్ద సానుభూతి కోసం ఒక నకిలీ ఇన్‌స్ట్రాగామ్‌ ఐడిని సృష్టించి బాధితురాలికి ఫ్రైండ్‌ రిక్వెస్ట్‌  పంపాడు. ఆమె ఓకే  చేసింది. ఈ క్రమంలో తనను వివాహం చేసుకోవాలి.. లేదంటే చంపుతానని యువతిని బెదిరించసాగాడు. దీంతో బాధితురాలు రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి సాంకేతిక ఆధారాలను సేకరించి శుక్రవారం ప్రవీణ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా సైబర్‌ క్రైమ్‌ సీఐ బి.ప్రకాష్‌ మాట్లాడుతూ  సోషల్‌ మీడియాలో బాలికలు, మహిళలు అపరిచితుల నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లను అంగీకరించవద్దని సూచించారు. 
చదవండి: శ్మశానవాటికలో నిప్పంటించుకుని..

మరిన్ని వార్తలు