మైనర్‌ను గర్భవతిని చేసి.. జైలుకు పంపుతారని

22 Mar, 2021 10:15 IST|Sakshi

హసన్‌పర్తి: మైనర్‌ను గర్భవతిని చేసిన కేసులో తనను జైలుకు పంపుతారనే భయంతో ఓ వివాహితుడు గొంతు కోసుకున్నాడు. ఈ ఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని 55వ డివిజన్‌ మునిపల్లికి చెందిన ఓదెల సతీష్‌కు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన మైనర్‌ బాలికను పలుమార్లు లోబర్చుకున్నాడు. దీంతో బాలికకు కడుపు నొప్పి రావడంతో వైద్యులను సంప్రదించగా గర్భం దాల్చినట్లు నిర్ధారించారు. బాధితురాలి కుటుంబసభ్యులు న్యాయం కోసం పెద్ద మనుషులను ఆశ్రయించగా, ఈ విషయం తెలుసుకున్న సతీష్‌ గ్రామం నుంచి పరారయ్యాడు. దీంతో అతని తల్లి ఓదెల పద్మను పంచాయితీకి రప్పించారు.

ఇరువర్గాల మధ్య పెద్ద గొడవ జరగడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఓదెల పద్మను పోలీస్‌ స్టేషన్‌కు తరలించి రక్షణ కల్పించారు. అనంతరం బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడు సతీష్‌ సాయంత్రం ఇంటికి రావడంతో.. గమనించిన బాధితురాలి కుటుంబసభ్యులు అతన్ని పట్టుకుని గొడవకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సతీష్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం తనను పోలీసులు జైలుకు పంపిస్తారన్న భయంతో వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో గొంతు కోసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఎంజీఎంకు తరలించారు. కాగా, సతీష్‌పై గతంలోనూ మైనర్‌పై లైంగిక దాడి కేసు నమోదైందని, అప్పుడు కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ జనార్దన్‌రెడ్డి తెలిపారు.
చదవండి: కర్ణాటకలో బ్లాయిమెయిల్‌: 400 సీడీలున్నాయి!

మరిన్ని వార్తలు