ప్రియుడి మోజులో.. సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ వైరుతో..

31 Oct, 2020 08:05 IST|Sakshi

సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ వైరుతో మెడకు చుట్టి  ప్రాణం తీసిన వైనం

సాక్షి, కొత్తూరు: ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తనే కడతేర్చిన భార్య ఉదంతమిది. సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ వైరును మెడకు చుట్టి దారుణంగా హతమార్చి.. ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూసినప్పటికీ పోస్టుమార్టం నివేదికలో హత్యగా తేలింది. ఈ దారుణానికి సంబంధించి కొత్తూరు ఎస్సై వై.సింహాచలం తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరు కాలేజీ రోడ్డుకు ఆనుకొని నివాసం ఉంటున్న దూలి రాము(35) ఈ నెల 26వ తేదీన చనిపోయాడు. అయితే తొలుత అత్మహత్యగా భావించారు. తల్లి లక్ష్మి మాత్రం రామును హత్య చేశారని ఆరోపిస్తూ అదేరోజున పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రాము మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. నివేదికలో హత్యగా వైద్యులు నిర్ధారించినట్టు ఎస్సై వివరించారు. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. రాము భార్య కుమారి ఇదే గ్రామానికి చెందిన సొండి సతీష్‌తో వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్టు గుర్తించి వారిని అదుపులోకి తీసుకొని  విచారించగా నేరం అంగీకరించినట్టు ఎస్సై చెప్పారు. తమ ఆనందానికి రాము అడ్డుగా ఉండేవాడని, దీంతో ప్రాణం తీసి అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పినట్టు వివరించారు.  (ప్రేమకథ విషాదాంతం)

సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ వైరును రాము మెడకు గట్టిగా బిగించి ప్రాణం తీశారన్నారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులను నమ్మించేందుకు ఉరివేసుకున్నట్లు పీకకు చున్నీ చుట్టి ఫ్యాన్‌కు వేలాడిదీసినట్టు కుమారి, సతీష్‌లు అంగీకరించారన్నారు. ఇద్దరినీ అరెస్టు చేసి శ్రీకాకుళం జ్యుడిషియల్‌ మెజిస్టేట్‌ కోర్డులో హజరు పరిచినట్లు చెప్పారు. కాగా తండ్రి చనిపోవడం, జైలుకి వెళ్లడంతో పాప శ్రీజ(7), బాబు సిద్దూ(5) ఒంటరయ్యారు.  

మరిన్ని వార్తలు