కూతుర్ని ప్రేమిస్తున్నాడని హత్య 

2 Mar, 2021 07:58 IST|Sakshi

యువకుడి దారుణ హత్య

కట్న పిశాచికి కారాగారం

కామాంధునికి జైలు శిక్ష

సాక్షి, బెంగళూరు(క్రిష్ణగిరి): నా కూతుర్ని ప్రేమిస్తావా అని ఓ వ్యక్తి యువకున్ని హత్య చేశాడు. వివరాలు.. బెంగళూరు జే.పి.నగరలో వసంత్‌ (25) కాయగూరల వ్యాపారి. అదే ప్రాంతంలో కాయగూరలమ్మే నారాయణన్‌ కూతురు సౌమ్య (18). వసంత్‌– సౌమ్య మధ్య ప్రేమ చిగురించింది. ఇది తెలిసి అమ్మాయిని తండ్రి నారాయణన్‌ మందలించాడు. అయినప్పటికీ ఆమె వసంత్‌తో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగిస్తూ వచ్చింది. దీంతో నారాయణన్‌ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. నా కూతురితో పెళ్లి చేస్తానని ఆశచూపి ఆదివారం రాత్రి వసంత్‌ను తీసుకొని బేరికె సమీపంలోని ఓ రహస్య స్థలానికెళ్లాడు. వసంత్‌తో బాగా మద్యం తాగించాడు. మద్యం మత్తులో ఉన్న వసంత్‌పై బండరాయితో బాది దారుణంగా హత్య చేశాడు. అనంతరం నారాయణన్‌ బేరికె పోలీసులకు లొంగిపోయాడు. సోమవారం ఉదయం పోలీసులు నిందితున్ని తీసుకుని ఘటనా స్థలానికి తీసుకెళ్లి వసంత్‌ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

కట్న పిశాచికి కారాగారం 
తుమకూరు: అదనపు కట్నం కోసం భార్యను వేధించి ఆమె మృతికి కారణమైన భర్తకు తుమకూరు జిల్లా కోర్టు ఐదేళ్ల జైలుశిక్షతో పాటు రూ. 30 వేలు జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు చెప్పింది. వివరాలు...తుమకూరు నగరంలోని వీరసాగరలో నివాసం ఉంటున్న మహ్మద్‌ అబూబకర్‌కు 2015 డిసెంబర్‌లో యాస్మిన్‌తో వివాహం జరిగింది. పెళ్లయిన ఏడాదికే విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరం రుజువు కావడంతో సోమవారం జిల్లా కోర్టు న్యాయమూర్తి మల్లికార్జునస్వామి నిందితుడికి ఐదేళ్ల జైలు, రూ. 30 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

 కామాంధునికి 20 ఏళ్ల జైలు 
తుమకూరు: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కామాంధుడికి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తుమకూరు ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. 2018 తుమకూరు జిల్లా శిరా తాలూకా తావరకెరె పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. తావరకెరెలో దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్న ప్రభు (48) అనే వ్యక్తి 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేశాడు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దారుణం రుజువు కావడంతో సోమవారం న్యాయస్థానం కామాంధునికి 20 ఏళ్ల జైలు, రూ. 25 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువడింది.  

చదవండి: పక్కూరి జాతరకు.. అక్కడినుంచి చెన్నై

>
మరిన్ని వార్తలు