3 రోజుల్లో 3 హత్యలు; అందుకే చంపేశా!

5 Dec, 2020 10:44 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మూడు రోజుల్లో మూడు హత్యలు

అందుకే వాళ్లను చంపేశాను

నేరం అంగీకరించిన 22 ఏళ్ల యువకుడు

చండీగఢ్‌: ‘‘చిన్నప్పటి నుంచి అందరూ.. నువ్వు చేతకాని వాడివి. బలహీనుడివి అనే వారు. వాళ్లెందుకు అలా మాట్లాడుతున్నారో నాకు అర్థమయ్యేది కాదు. అప్పుడే ఈ ప్రపంచానికి నేనేంటో చూపించాలని నిర్ణయించుకున్నా. అందుకే ఈ హత్యలు చేశా’’ అంటూ 22 ఏళ్ల యువకుడు పోలీసుల ఎదుట నేరం అంగీకరించాడు. అకారణంగా ముగ్గురు వ్యక్తుల ప్రాణాలు బలిగొన్నందుకు అతడిని అరెస్టు చేశారు. వివరాలు.. నవంబరు 23, 24, 25 తేదీల్లో హరియాణాలోని గురుగ్రాంలో వరుస హత్యలు జరిగాయి. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో బిహార్‌కు చెందిన మహ్మద్‌ రాజీ(22) ఈ నేరాలకు పాల్పడ్డట్టు గుర్తించారు. ఐఎఫ్‌ఎఫ్‌సీఓ చౌక్‌ వద్ద గురువారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

ఇక విచారణలో భాగంగా తాను ముగ్గురిని హత్య చేసినట్లు రాజీ పోలీసులకు తెలిపాడు. ఒంటరిగా ఉన్న వ్యక్తులతో మాటలు కలిపి, వారికి మద్యం తాగించి మచ్చిక చేసుకునేవాడినని, ఆ తర్వాత పదునైన ఆయుధంతో దాడి చేసి వారిని హతమార్చినట్లు వెల్లడించాడు. నవంబరు 23న గురగ్రాం లీజర్‌వ్యాలీ పార్క్‌, ఆ మరుసటి రోజు సెక్టార్‌ 40లో ఓ సెక్యూరిటీ గార్డును, ఆ తర్వాతి రోజు రాకేశ్‌ కుమార్‌ అనే వ్యక్తిని చంపేసినట్లు పేర్కొన్నాడు. రాకేశ్‌ కుమార్‌ను చంపిన తర్వాత అతడి మొండెం నుంచి తలను వేరుచేశానన్న రాజీ, పోలీసులకు ఘటనాస్థలికి తీసుకువెళ్లగా తలను స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: టీవీ చూడనివ్వడం లేదని..)

ఈ విషయం గురించి రాజీ మాట్లాడుతూ.. రాకేశ్‌ గొంతు కోసిన తర్వాత తనను అలా వదిలేయడం ఇష్టంలేక కన్హాయ్‌ గ్రామంలో తలను పడేసినట్లు చెప్పుకొచ్చాడు. కాగా సుమారు 250-300 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన తర్వాత నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మూడు హత్యలతో పాటు ఢిల్లీలో ఇటీవల జరిగిన 10 హత్యలతో కూడా రాజీకి సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. చిన్ననాటి చేదు అనుభవాల వల్ల ఆత్మన్యూనతకు లోనై ఈ నేరాలకు పాల్పడినట్లు హంతకుడు తెలిపాడని పేర్కొన్నారు. ( చదవండి:  ‘సైకో కిల్లర్’‌ ఎన్‌కౌంటర్‌!)

మరిన్ని వార్తలు