రెండో పెళ్లి.. తల్లిదండ్రులు వేరు కాపురం ఉండనివ్వలేదని..

9 Dec, 2021 08:02 IST|Sakshi

కల్లూరు: వేరు కాపురం ఉంటామంటే తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదనే మనస్తాపంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాలు.. చిన్నటేకూరు గ్రామానికి చెందిన అబ్దుల్‌ కరీం దుస్తుల వ్యాపారం చేస్తూ కుటుంబానికి అండగా ఉన్నాడు. మొదటి భార్య 2018లో ఆత్మహత్యకు పాల్పడగా నాలుగు నెలల క్రితమే నందికొట్కూరు మండలం చెట్కూరుకు చెందిన ఫాతిమాబీని రెండో వివాహం చేసుకున్నాడు. కాగా తాము వేరు కాపురం ఉంటామని కొంతకాలంగా కోరుతున్నా.. అందుకు తల్లిదండ్రలు అంగీకరించడం లేదు.

చదవండి: POCSO Act: బాలికపై అత్యాచార కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష!

తాము బతికి ఉన్నంత వరకు అందరం కలిసే ఉందామని సర్దిచెప్పేవారు. దీంతో మనస్తాపం చెంది అబ్దుల్‌ కరీం మంగళవారం సాయంత్రం దుస్తుల దుకాణంలో పురుగు మందు తాగాడు. గమనించి కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటిపకే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. పోలీసులు బుధవారం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.   

భార్య కాపురానికి రావడంలేదని...  
కర్నూలు: భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించిన పాత కల్లూరులో నివాసముంటున్న పులికొండ(27) ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం మృతి చెందాడు. దేవనకొండ మండలం తెర్నేకల్‌కు గ్రామానికి చెందిన మేరీతో పదేళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలం సంసారం సాఫీగా సాగింది. పులికొండ మద్యానికి అలవాటుపడి భార్యను సరిగా చూసుకోకపోవడంతో ఆమె గొడవ పడి పుట్టినింటికి వెళ్లింది.

చదవండి: 9 లక్షల పొదుపు మొత్తం.. అంతా ఊడ్చేశారు.. అప్పుడు తెలిసింది!

పెద్ద మనుషులు రెండు సార్లు పంచాయితీ చేసినప్పటికీ పులికొండలో మార్పు రాలేదు. దీంతో ఆమె కాపురానికి రానని తేల్చి చెప్పడంతో మనస్తాపానికి గురై కల్లూరు వక్కెరవాగు వద్ద ఈ నెల 6న మద్యంలో పురుగు మందు కలుపుకుని తాగి అదే విషయాన్ని సోదరుడికి ఫోన్‌ చేసి చెప్పాడు. అతను అక్కడికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న పులికొండను ఆసుపత్రిలో చేర్పించగా కోలుకోలేక బుధవారం మృతి చెందాడు. నాలుగవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.     

మరిన్ని వార్తలు