భార్య పుట్టింటి నుంచి రావట్లేదని ఉరేసుకున్న భర్త

11 Apr, 2021 12:16 IST|Sakshi
తాతారావు(ఫైల్‌)

సాక్షి, కొమ్మాది (భీమిలి): పెళ్లయిన నాలుగు నెలలకే ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యతో విబేధాల కారణంగా మనస్తాపం చెందిన ఆయన ఉరి వేసుకుని మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. జీవీఎంసీ నాలుగో వార్డు మంగమారిపేట ప్రాంతానికి చెందిన గరికిన తాతారావు అలియాస్‌ టోని (24)కి నాలుగు నెలల కిందట శ్రీకాకుళం జిల్లా సంతమ్మాళి మండలం మరువాడకు చెందిన పావనితో వివాహం జరిగింది. తాతారావు నగరంలో ఓ రెస్టారెంట్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. రెండు నెలల వరకు వీరి జీవితం సరదాగా సాగింది. తర్వాత వీరిద్దరి మధ్య విబేధాలు మొదలయ్యాయి. వారం రోజుల కిందట పావని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి పోయింది.

రోజూ ఆమెకు ఫోన్‌ చేస్తూ ఇంటికి రమ్మని ప్రాధేయ పడినట్టు తాతారావు తల్లిదండ్రులు గరికిన ఎల్లయ్య, పోలమ్మ తెలిపారు. అయితే ఆమె రాకపోవడంతో మనస్తాపానికి గురైన తాతారావు శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం విగతజీవిగా వేలాడుతున్న తన కుమారుడిని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే భీమిలి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎప్పుడు సరదాగా ఉంటూ.. అందరిని ఆప్యాయంగా పలకరించే తాతారావు మృతి చెందడంతో.. మంగమారిపేట గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.    

చదవండి: కూకట్‌పల్లి: యువతిని ఎరగా వేస్తారు, ఆశపడ్డావో అంతే!

విచారణ కోసం వెళ్లిన పోలీసుని రాళ్లతో కొట్టి..

మరిన్ని వార్తలు