ఐస్‌క్రీం అని చెప్పి పిల్లలకు ఎలుకల మందు పెట్టాడు

1 Jul, 2021 12:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై : ఆర్థిక విషయాల్లో భార్యభర్తల మధ్య చోటుచేసుకున్న గొడవ ఓ చిన్నారి ప్రాణం తీసింది. ఐస్‌ క్రీమ్‌ అని నమ్మబలికి తన పిల్లలకు ఎలుకల మందు తినిపించాడో తండ్రి. మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబై, మన్‌ఖుర్ద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధికి చెందిన మహ్మద్‌ అలి నౌషద్‌ అన్సారీ, నజియా బేగం భార్యా,భర్తలు. వీరికి అలీనా అన్సారీ(7), అలీషాన్‌ అన్సారీ(6), అర్మాన్‌ అన్సారీ(2) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న అన్సారీ రోజుకు రూ. 500 సంపాదించేవాడు. అయితే, ఇంటి అవసరాల నిమిత్తం భార్యకు 100-150 రూపాయలు మాత్రమే ఇచ్చేవాడు. ఈ విషయమై భార్యాభర్తలకు తరుచూ గొడవలు జరిగేవి. కొద్దిరోజుల క్రితం కూడా ఇద్దరి మధ్యా గొడవ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో అన్సారీ పిల్లలను తీసుకుని వదిన ఇంటికి బయలుదేరాడు. పోతూపోతూ ఎలుకల మందు కొనుక్కున్నాడు. మార్గం మధ్యలో అలీనా తనకు ఐస్‌ క్రీమ్‌ కావాలని అడిగింది. దీంతో అతడు ఎలుకల మందును ఐస్‌క్రీమని నమ్మబలికి వారికి తినిపించాడు.

వారు అస్వస్థతకు గురవ్వగానే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పిల్లలు అస్వస్థతకు గురయ్యారని మాత్రమే భార్యకు చెప్పాడు. ఆమె అక్కడికి వచ్చింది. చికిత్స అనంతరం కోలుకున్న అలీనా విషయం తన తల్లికి చెప్పింది. ఆసుపత్రి యజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు అక్కడికి చేరుకున్నారు. తల్లిదండ్రులను విచారించగా.. తాము నిద్రలో ఉన్నప్పుడు పిల్లలు ఎలుకల మందు తిన్నారని చెప్పారు. జూన్‌ 29, ఆర్మన్‌ చనిపోయాడని పోలీసులకు సమాచారం అందటంతో మళ్లీ అక్కడకు వెళ్లారు. కుమారుడి మృతితో ఆవేదనకు గురైన నజియా తన భర్త చేసిన ఘోరాన్ని వెల్లడించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు.

చదవండి : తలకు గన్నుపెట్టి భూమి పత్రాలను రాయించుకున్న ఎస్సై..

మరిన్ని వార్తలు