సూసైడ్‌ నోట్‌: లాయర్‌ ఆత్మహత్య.. యోగా టీచర్‌ హత్య

5 May, 2021 14:23 IST|Sakshi

మదురైలో వెలుగు చూసిన సంఘటన

లాయర్‌ సూసైడ్‌ నోట్‌తో వెలుగులోకి యోగా టీచర్‌ హత్య

చెన్నై: భార్య దూరమయ్యింది. పదేళ్ల బిడ్డతో ఒంటరిగా ఉంటున్నాడు. బాధితులకు న్యాయం చెప్పాల్సిన లాయర్‌ అయ్యుండి.. క్షణికావేశంలో ఓ తప్పు చేశాడు. ఆ తర్వాత తనను తాను క్షమించుకోలేక ఆత్మహత్య చేసుకుని ప్రాణం తీసుకున్నాడు. పదేళ్ల బిడ్డను ఒంటిరి చేసి వెళ్లాడు. ఈ విషాద సంఘటన మధురైలో చోటు చేసుకుంది. సదరు లాయర్‌ రాసిన సూసైడ్‌ నోట్‌ కనిపించకుండా పోయిన ఓ యోగా టీచర్‌కు సంబంధించిన వివరాలు వెలుగులోకి తెచ్చింది.

ఆ వివరాలు.. లాయర్‌గా పని చేస్తున్న హరిక్రిష్ణన్‌ అనే వ్యక్తి తన పదేళ్ల కుమార్తెతో కలిసి మదురైలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమలో మంగళవారం తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. హరిక్రిష్ణన్‌ ఇంట్లో లభించిన సూసైడ్‌ నోట్‌ మరో మిస్సింగ్‌ కేసు పరిష్కరించడానికి సాయం చేసింది. 

మిస్సింగ్‌ కేసు వివరాలు...
మదురైకి చెందిన చిత్రదేవి యోగా టీచర్‌గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె గత నెల 2న ఇంటి నుంచి బయటకు వెళ్లారు. తిరిగి రాలేదు. దాంతో చిత్రదేవి తండ్రి ఏప్రిల్‌ 5న పోలీసులకు ఫిర్యాదు చేశారు. యోగా టీచర్‌ తండ్రి కన్నయ్య మదురైలోని తిరుమంగళంలో పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాక దాన్ని సీఎం సెల్‌కు ఫార్వర్డ్‌ చేసి.. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాడు. 

అంతేకాక తన కుమార్తెకు, లాయర్‌ హరిక్రిష్ణన్‌కు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్స్‌ను పోలీసులకు అందించాడు. చిత్రదేవి తండ్రి వీటిని పోలీసులకు ఇచ్చాడు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. మంగళవారం హరిక్రిష్ణన్‌ ఆత్మహత్య చేసుకుని మరణించాడు. 

సూసైడ్‌ నోట్‌లో ఏం ఉంది..
హరిక్రిష్ణన్‌ ఇంటి దగ్గర లభించిన సూసైడ్‌ నోట్‌లో అతడు చిత్రదేవిని హత్య చేసినట్లు అంగీకరించాడు. ఆమెను చంపి.. తన ఇంటి బాత్రూమ్‌లో సమాధి చేసినట్లు వెల్లడించాడు. క్షణికావేశంలో ఘాతుకం చేసినప్పటికి ఆ తర్వాత అతడు స్థిమితంగా ఉండలేకపోయాడు. చేసిన తప్పుకు బాధపడుతూ.. తనను తాను క్షమించుకోలేక ఆత్మహత్యచేసుకుంటున్నట్లు సూసైడ్‌నోట్‌లో తెలిపాడు. 

చదవండి: న్యాయవాద దంపతులది ప్రభుత్వ హత్యే

మరిన్ని వార్తలు