ఎమ్మెల్సీ కవిత టీవీ చానల్‌ పేరుతో మోసం 

7 Apr, 2021 07:39 IST|Sakshi
బాధితుడు మహమ్మద్‌

రూ. 6.50 లక్షలకు టోకరా  

సాక్షి, కామారెడ్డి: ఎమ్మెల్సీ కవిత టీవీ చానల్‌ పేరుతో నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ. 6.50 లక్షలు వసూలు చేసి మోసం చేసిన ఉదంతం కామారెడ్డిలో మంగళవారం వెలుగుచూసింది. పట్టణంలోని విద్యానగర్‌ కాలనీకి చెందిన మహమ్మద్‌ ఇటీవలే గల్ఫ్‌ నుంచి తిరిగివచ్చాడు. అతనికి పరిచయమైన మహేశ్‌గౌడ్, వినోద్‌లు ఎమ్మెల్సీ కవితకు చెందిన టీవీ చానల్‌ ఒకటి ఉందని, అందులో చైర్మన్‌ పదవి, వేములవాడ, కామారెడ్డిలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తామని నమ్మించారు.

చైర్మన్‌ హోదాతో తయారుచేసిన ఐడీ కార్డు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల తాళాలు సైతం చేతికందించారు. దీంతో వారిని నమ్మిన మహమ్మద్‌ రూ. 6.50 లక్షలు ముట్టజెప్పాడు. అంతేగాక ఎమ్మెల్సీ కవితతో రహస్యంగా మాట్లాడవచ్చని ఓ వాకీటాకీని కూడా ఇచ్చారు. అయితే, ఇదంతా మోసమని తరువాత గుర్తించిన మహమ్మద్‌.. పోలీసులను ఆశ్రయించాడు. మహేశ్, వినోద్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: నాపై తూటాల దాడికి 24 ఏళ్లు.. అయినా నేటి వరకు

మరిన్ని వార్తలు