విడాకులిస్తావా? నగ్న చిత్రాలు ఇంటర్నెట్‌లో పెట్టాలా?

29 Dec, 2020 12:42 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆడ పిల్లలు పుట్టారని వేధింపులు 

సాక్షి, నగరంపాలెం: రెండు వేర్వేరు సంఘటనలు.. రెండింటిలోనూ ఆడ పిల్లలు పుట్టారనే ఒక్క కారణంతో భార్యలను వేధిస్తున్నారు భర్తలు. దీంతో బాధిత మహిళలు ఎస్పీ గ్రీవెన్స్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. తుళ్లూరు మండలం లింగాయపాలెం గ్రామానికి చెందిన జి.అన్నారావుతో అదే గ్రామానికి చెందిన సౌజన్యకు 2008లో వివాహమైంది. వారికి ఇద్దరు ఆడ పిల్లలు సంతానం. పెళ్లైన దగ్గర నుంచి అనుమానంతో భర్త వేధింపులకు గురిచేసేవాడని, చెడు వ్యసనాలకు బానిసయ్యాడని భార్య తెలిపింది. వారసుడిగా మగ పిల్లాడు కావాలని  విడాకులిస్తే మరో వివాహం చేసుకుంటానని భర్త వేధించేవాడని వాపోయింది. పుట్టింటికి వెళ్లి రూ.5 లక్షలు తేవాలని లేదంటే ఇంట్లో వద్దని తరిమివేశాడని తెలిపింది. 

ఇంటర్నెట్‌లో వీడియోలు పెడతానని
మరో కేసులో విడాకులు ఇవ్వకపోతే నగ్న చిత్రాలు ఇంటర్నెట్‌లో పెడతానని తన భర్త వేధింపులకు గురిచేస్తున్నట్లు భార్య పేర్కొంది. ఆమె మాటల్లో.. గుంటూరు జిల్లాలోని ఓ ప్రాంతానికి చెందిన వ్యక్తితో ప్రకాశం జిల్లాకు చెందిన తనకు 2016లో వివాహమైంది. కట్నం కింద లక్ష రూపాయలు, 5 సవర్ల బంగారం, సామాన్లు, రూ.10 లక్షలు ఖరీదు చేసే ఇంటి స్థలం రాసిచ్చాము. తమకు పాప పుట్టిన దగ్గర నుంచి భర్త, అత్త, మామ, ఆడపడుచుల నుంచి అదనపు కట్నం తేవాలని వేధింపులు చేస్తున్నారు. దీనిపై 2018లో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండగా 2019లో భరణం కేసు వేయగా అది పెండింగ్‌లో ఉంది.

నా భర్త కొద్ది రోజులుగా సమీప బంధువుకి ఫోన్‌ చేసి నా ఫోన్‌ ట్యాప్‌ చేసి రికార్డు చేసినట్లు, వాటిల్లో కొన్నింటిని వాట్సాప్‌ సందేశాలు పంపుతున్నట్లు ఆమె తెలిపిందని బాధిత భార్య పేర్కొంది. గతంలో తాను స్నానం చేస్తుండగా భర్త రహస్యంగా ఫొటోలు, వీడియో తీశాడని ఆమె చెప్పినట్లు బాధితురాలు పేర్కొంది. భర్తకి విడాకులు ఇవ్వకపోతే నగ్న చిత్రాలు ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరిస్తున్నాడని వాపోయింది. తెలిసిన వ్యక్తుల సహయంతో రెండు సెల్‌ కంపెనీల ప్రతినిధుల సహాయంతో ఫోన్‌ ట్యాప్‌ చేసినట్లు తెలిసిందని పేర్కొంది. భర్తపై, అతనికి సహకరించిన ఆడపడుచు, సెల్‌ కంపెనీల ప్రతినిధులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఆమె కోరింది. (రూ. 250 భోజనం ఆర్డర్‌.. 50 వేలు మాయం)

మరిన్ని వార్తలు