బెంగుళూరులో చంపారు.. రావూరులో పూడ్చారు..

1 Feb, 2021 09:00 IST|Sakshi

హతుడు సిద్ధార్థ్‌ కర్ణాటక మాజీ సీఎం ధరమ్‌సింగ్‌ బంధువు

రాపూరు(నెల్లూరు జిల్లా): బెంగళూరులో ఓ వ్యక్తిని దుండగులు కిడ్నాప్‌ చేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు అభయారణ్యంలో పూడ్చిపెట్టారు. హత్యకు గురైన వ్యక్తి కర్ణాటక రాష్ట్ర మాజీ సీఎం ధరమ్‌సింగ్‌ సమీప బంధువు కావడంతో పోలీసులు శరవేగంగా దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కర్ణాటక పోలీసుల సమాచారం మేరకు.. బెంగళూరు నగరం దాసరహల్లి స్టే అబోడా కోలేమాన్‌ అపార్ట్‌మెంట్‌ ప్లాట్‌ నంబర్‌ 402లో సిద్ధార్థ్‌ దేవేంద్రసింగ్‌ (27) నివాసం ఉంటున్నారు. (చదవండి: ఘరానా మోసం: మరణించినట్లుగా నమ్మించి..)

ఆయన గతనెల 19న ఉదయం 5 గంటల ప్రాంతంలో స్నేహితుడిని కలిసేందుకు అమెరికా వెళుతున్నానని తన తండ్రికి వాట్సాప్‌ మెసేజ్‌ పెట్టి ఇంట్లోంచి బయటకు వచ్చారు. అప్పటినుంచి అతడి  ఫోను స్విచ్చాఫ్‌ అయింది. దీంతో కుటుంబసభ్యులు అతడి కోసం గాలించారు. ఫలితం లేకపోవడంతో గతనెల 25న అమృతహళ్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. సిద్ధార్థ్‌ కాల్‌ డీటైల్స్‌ ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. (చదవండి: ప్రేమవివాహం : పెళ్లికొడుకు ఇంటికి నిప్పు)

చివరి కాల్‌ తిరుపతికి చెందిన వినోద్‌కు వెళ్లిందని  గుర్తించారు. దీంతో బెంగళూరుకు పోలీసులు తిరుపతి చేరుకుని వినోద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సిద్ధార్‌్థను కిడ్నాప్‌ చేసి హత్యచేసి మృతదేహాన్ని రాపూరు మండలం వెలుగోను అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టినట్లు వినోద్‌ చెప్పాడు. ఆదివారం అటవీ ప్రాంతానికి చేరుకున్న బెంగళూరు పోలీసులు మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ప్రాంతాన్ని గుర్తించారు. వినోద్‌ను ఘటనా స్థలానికి తీసుకొచ్చి మృతదేహాన్ని వెలికితీసేందుకు చర్యలు చేపట్టారు. ఆస్తి విభేదాల నేపథ్యంలోనే సిద్ధార్థ్‌ హత్యకు గురైనట్టు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు