రూ. 2 కోట్ల కోసం కిడ్నాప్‌.. కోవిడ్‌ శవంగా అంత్యక్రియలు

29 Jun, 2021 10:06 IST|Sakshi
పోలీసుల అదుపులో నిందితులు

ఆగ్రాలో వెలుగు చూసిన దారుణం

డబ్బుల కోసం మిత్రుడిని చంపిన స్నేహితులు

లక్నో: మిత్రుని కోసం ప్రాణాలిచ్చే స్నేహితుల గురించి చదివాం. కానీ ప్రస్తుతం డబ్బుల కోసం మిత్రుడి ప్రాణాలు తీసే ఘటనలు ఎక్కువయ్యాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి ఆగ్రాలో చోటు చేసుకుంది. డబ్బు కోసం స్నేహితుడిని కిడ్నాప్‌ చేశారు. ఆ తర్వాత అతడిని చంపి.. కోవిడ్‌ వల్ల చనిపోయాడని చెప్పి.. అంత్యక్రియలు కూడా నిర్వహించారు. కానీ పోలీసులు రంగంలోకి దిగడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. 

ఉత్తరప్రదేశ్‌కు చెందిన కోల్డ్‌ స్టోరేజ్‌ ఓనర్‌ సురేష్‌ చౌహాన్‌ ఒక్కగానొక్క కుమారుడు సచిన్‌ చౌహాన్‌(23) జూన్‌ 21న కిడ్నాప్‌ అయ్యాడు. 2 కోట్ల రూపాయల కోసం స్నేహితులే ఈ నేరానికి పాల్పడ్డారు. సచిన్‌ స్నేహితులు నలుగురు, మరో వ్యక్తితో కలిసి అతడి కిడ్నాప్‌కు ప్లాన్‌ చేశారు. ఈ క్రమంలో సచిన్‌ స్నేహితుడు ఒకరు అతడికి కాల్‌ చేసి పార్టీ చేసుకుందామని పిలిచాడు. తర్వాత అందరూ ఓ పాడుబడిని ట్యాంక్‌ మీద కూర్చుని మందు తాగారు. అనంతరం లామినేషన్‌ పేపర్‌తో సచిన్‌కు ఊపిరాడకుండ చేసి హత్య చేశారు నిందితులు. 

సచిన్‌ కిడ్నాప్‌ అయిన నాటి నుంచి అతడి తల్లి.. కుమారుడి నంబర్‌కు కాల్‌ చేస్తూనే ఉంది. వేరే వాళ్లు ఫోన్‌ లిఫ్ట్‌ చేసి.. సచిన్‌ ఇక్కడ లేడని తెలిపేవారు. దాంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. మరోవైపు సచిన్‌ స్నేహితులు.. తమ మిత్రుడు కోవిడ్‌ వల్ల చనిపోయాడని నమ్మించడం కోసం.. పీపీఈ కిట్లు ధరించి.. మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించి.. అస్థికలను సమీపంలోని నదిలో నిమజ్జనం చేశారు.

ఇక వీరి కదలికపై అనుమానం వచ్చిన ఓ వ్యక్తి వీరి గురించి పోలీసలుకు సమాచారం ఇవ్వడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో 2 కోట్ల రూపాయల కోసం తామే సచిన్‌ను కిడ్నాప్‌ చేశామని.. కానీ అతడు బతికుంటే తమకు ప్రమాదం అని భావించి.. హత్య చేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ.. ‘‘నిందితులు 25 రోజుల క్రితమే హత్యకు ప్లాన్‌ చేశారు. సచిన్‌ను చంపిన తర్వాత అతడి తల్లిదండ్రులకు కాల్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేయాలని భావించారు’’ అని తెలిపాడు.

చదవండి: పోలీసులే కిడ్నాపర్లుగా మారి.. ఆస్తులు రాయించుకున్నారు

మరిన్ని వార్తలు