పెళ్లైన మహిళతో వివాహేతర సంబంధం.. ఆపై

9 Apr, 2021 18:16 IST|Sakshi

పట్టపగలు వ్యక్తి హత్య

వివాహేతర సంబంధమే కారణమంటున్న స్థానికులు

గార్లలో ఘటన

సాక్షి, గార్ల(మహబూబాబాద్‌‌) : వివాహేతర సంబంధం నెపంతో ఓ వ్యక్తిని పట్టపగలే హత్య చేసిన సంఘటన మహబూబాబాద్‌ జిల్లా గార్లలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గార్లలోని పుట్టకోట బజారుకు చెందిన గొడుగు ధనమ్మ భర్త ఎనిమిది సంవత్సరాల క్రితం చనిపోగా కుమారుడు ఉన్నాడు. ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం తిమ్మినేనిపాలెం గ్రామానికి చెందిన రాయల వెంకటేశ్వర్లు(55) కారేపల్లిలోని కవిత ఇంజనీరింగ్‌ కళాశాల బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

రోజూ గార్ల నుంచి విద్యార్థులను కళాశాలకు తీసుకెళ్లి.. తిరిగి సాయంత్రం తీసుకువచ్చి గార్లలోనే బస చేసేవాడు. ఈ క్రమంలో ధనమ్మతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. వివాహేతర సంబంధం విషయం తెలుసుకున్న ధనమ్మ తమ్ముడు చాట్ల కోటేష్, ఆమె అక్క కొడుకు గంగరబోయిన సంపత్‌ కలిసి పథకం ప్రకారం మధ్యాహ్నం ధనమ్మ ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఇంట్లో ధనమ్మతో పాటు వెంకటేశ్వర్లు ఉండడంతో కోపోద్రిక్తులైన కోటేష్, సంపత్‌ ఫ్యాన్‌ స్టాండ్‌ రాడ్‌తో వెంకటేశ్వర్లును చితకబాదారు.

దీంతో తలకు, చాతిపై తీవ్రగాయాలై వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. దాడి చేస్తుండగా అడ్డుకోబోయిన ధనమ్మకు సైతం గాయాలయ్యాయి. అనంతరం నిందితులిద్దరూ పరారయ్యారు. సమాచారం అందుకున్న ఎస్సై బాదావత్‌ రవి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మహబూబా బాద్‌ నుంచి క్లూస్‌ టీంను రప్పించి ఫింగర్‌ ప్రింట్స్‌ సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవి తెలిపారు. 

మరిన్ని వార్తలు