తల్లి ఎదుటే పసికందును చంపిన కిరాతక తండ్రి

20 Jan, 2021 09:51 IST|Sakshi
పసికందు మృతదేహంతో విలపిస్తున్న లక్ష్మి, ఇన్‌సెట్లో నిందితుడు బాల్‌రెడ్డి

పసికందును కడతేర్చిన కన్నతండ్రి

సాక్షి, ప్రకాశం : ముక్కుపచ్చలారని పసికందును కన్నతండ్రే కిరాతకంగా కడతేర్చిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. వైఎస్సార్‌ జిల్లా ఎర్రగుంట్లకు చెందిన బాల్‌రెడ్డి అలియాస్‌ బాలరాజు.. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన లక్ష్మి అనాథలు. వీరు ప్లాస్టిక్‌ కాగితాలు, బాటిళ్లు ఏరుకొని విక్రయిస్తూ జీవనం సాగించేవారు. కొంతకాలంగా ఒకరినొకరు ఇష్టపడి సహజీవనం చేస్తున్నారు. ఈక్రమంలో లక్ష్మి గర్భం దాల్చింది. నాలుగు మాసాల క్రితం జూపాడుబంగ్లాకు చేరుకొని బస్టాండు సమీపంలోని కేసీ కాల్వ విశ్రాంతి భవనం ప్రాంగణంలో నివాసముంటున్నారు. రెండు నెలల క్రితం లక్ష్మి పండంటి ఆడబిడ్డ(దుర్గ)కు జన్మనిచ్చింది. ఆమె పాపతో విశ్రాంతి భవనంలో ఉండగా బాల్‌రెడ్డి ప్లాస్టిక్‌ బాటిళ్లు ఏరుకొని విక్రయించటం, వ్యవసాయ కూలిపనులకు వెళ్లటం ద్వారా వచ్చే డబ్బుతో లక్ష్మి, బిడ్డను చూసుకుంటూ ఉండేవాడు. చదవండి: ‘నన్ను ఎందుకు వద్దంటున్నావో ఒక్కసారి చెప్పు’

సోమవారం రాత్రి మద్యం మత్తులో బాల్‌రెడ్డి లక్ష్మిని చితకబాది పసికందును లాక్కొని పైకి ఎత్తి కిందపడేసి పాల డబ్బాను నోట్లో కుక్కాడు. ఊపిరి ఆడక పసిబిడ్డ మృత్యుఒడికి చేరింది. కళ్లెదుటే బిడ్డను చంపటంతో లక్ష్మి కన్నీరు మున్నీరుగా విలపించింది. ఉదయం శిశివు మృతదేహాన్ని పూడ్చిపెట్టేందుకు బాల్‌రెడ్డి శ్మశానవాటిక వైపు వెళ్తుండగా గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. నందికొట్కూరురూరల్‌ సీఐ ప్రసాదు, ఎస్‌ఐ తిరుపాలు సిబ్బందితో ఘటనా ప్రాంతానికి చేరుకుని విచారించారు. శిశువు తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. పసికందు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తల్లికి అప్పగించారు. 

మరిన్ని వార్తలు