హత్య చేసి శవంతో పోలీస్‌ స్టేషన్‌కు..

18 Oct, 2021 07:30 IST|Sakshi

సాక్షి, యశవంతపుర: సోదరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని వ్యక్తిని హత్య చేసి శవాన్ని తీసుకొచ్చి లొంగిపోయిన ఘటన బెంగళూరు అన్నపూర్ణేశ్వరినగర పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. వివరాలు.. కోలారు జిల్లా మాలూరుకు చెందిన మహిళ ఒక గార్మెంట్స్‌లో పని చేస్తూ అన్నపూర్ణేశ్వరినగర చంద్రశేఖర్‌ లేఔట్‌లో నివాసముంటోంది. ఆమె భర్త మాలూరులోనే ఉండేవాడు. ఈ సమయంలో తమిళనాడుకు చెందిన భాస్కర్‌ అనే వ్యక్తితో ఆమెకు రెండేళ్ల కిందట పరిచయమై అక్రమ సంబంధం ఏర్పడింది.

చదవండి: (బుల్లితెర నటి ఉమామహేశ్వరి కన్నుమూత)

దసరా రోజున ఆమె భర్త వద్దకు మాలూరు వెళ్లగా, అక్రమ సంబంధంపై గొడవ జరిగింది. ఇక బెంగళూరుకు వెళ్లవద్దని భర్త హెచ్చరించాడు. అయితే ఆమె చిన్న కొడుకును తీసుకొని బెంగళూరుకు వచ్చేసింది. శనివారం సాయంత్రం ఆమెను ప్రియుడు భాస్కర్‌ కలిశాడు. ఈ విషయాన్ని ఆమె కొడుకు మేనమామ మునిరాజుకు ఫోన్లో చెప్పాడు. మహిళ, ప్రియుడు ఆటోలో వెళ్తుండగా మునిరాజు, అతని మిత్రులు మారుతీ, నాగేశ్, ప్రశాంత్‌లు అడ్డుకుని మహిళను పంపించివేశారు. భాస్కర్‌ను తీవ్రంగా కొట్టడంతో చనిపోయాడు. అదే ఆటోలో మృతదేహాన్ని తీసుకుని అన్నపూర్ణేశ్వరినగర పీఎస్‌లో లొంగిపోయారు. నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ సంజీవ్‌ పాటిల్‌ తెలిపారు.  

చదవండి: (ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. అంతలోనే భార్యను..)

మరిన్ని వార్తలు