అత్యాచారం చేసి.. రూ. 5 చేతిలో పెట్టాడు

22 Mar, 2021 15:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భోపాల్‌ : అభం శుభం తెలియని 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. అత్యాచారం అనంతరం బాలిక చేతిలో ఐదు రూపాయలు పెట్టి, ఎవరికీ చెప్పద్దని బెదిరించాడు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ‘‘ భోపాల్‌ అయోధ్య నగర్‌కు చెందిన 8 ఏళ్ల బాలిక శనివారం మధ్యాహ్నం ఇంటి ఆవరణలో  ఆడుకుంటోంది. అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి బాలికకు రూ. 100 ఇచ్చి పొగాకు పొట్లాలు తీసుకురావాల్సిందిగా చెప్పాడు. పాప పొగాకు పొట్లాలు తెచ్చి అతడికి ఇచ్చింది. అయితే, అతడు వాటిని తీసుకోకుండా కొద్ది దూరంలో మరో వ్యక్తి ఉన్నాడని అతడికి ఇవ్వాలని చెప్పాడు. దీంతో చిన్నారి నడుచుకుంటూ ముందుకు వెళ్లింది. అతడు పాపను అనుసరించి, చెత్త కుప్పల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం ఐదు రూపాయలు పాప చేతిలో పెట్టి, విషయం ఏవరికీ చెప్పొద్దని బెదిరించాడు.

ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిన బాలిక ఈ విషయం అమ్మమ్మకు చెప్పింది. దీంతో ఆమె పాపను అయోధ్య నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ను తీసుకెళ్లింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాప ఆ వ్యక్తిని రెండు సార్లు మాత్రమే చూసినట్లు పోలీసులకు చెప్పింది. ఆ రోజు ఆ ఏరియాలో తిరిగిన 40 మంది ఫొటోలను చూపించగా.. రవి అనే 30 ఏళ్ల వ్యక్తిని గుర్తించింది. అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడి భార్య అతడితో విడిపోయి వేరుగా ఉంటోందని విచారణలో తేలింది. అత్యాచారం కారణంగా పాప తీవ్రమైన షాక్‌కు గురైనట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పాప శారీరక ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వెల్లడించారు.

చదవండి : ‘ఎలా చావాలి’ అని యూట్యూబ్‌లో సెర్చ్‌ చేసి..

మరిన్ని వార్తలు