మొదటి భార్యకు విడాకులు.. రెండో భార్య కుమార్తెపై కన్ను

5 Oct, 2020 19:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తండ్రిగా ఉంటానని నమ్మించి కూతురు లాంటి బాలికపై ఓ వ్యక్తి కన్నేశాడు. మేడ్చల్‌ జిల్లా నేరేడ్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసున్న ఈ సంఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయరాం అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. భార్యతో విభేదాల కారణంగా కొన్నేళ్ల క్రితం విడాకులు ఇచ్చాడు. అనంతరం ఒంటరితనం భరించలేక మరో మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే అప్పటికే ఆమెకు (రెండోభార్య) 17 ఏళ్ల కుమార్తె ఉంది. వివాహం అనంతరం తన కుమార్తెను బంధువుల వద్ద ఉంచుతానని ఆమె చెప్పింది. దానికి అంగీకరించని జయరాం.. ఆ బాలికను తమతోనే ఉంచుకుందామని, తన సొంత కుమార్తెలా చూసుకుంటానని భార్యకు భరోసా ఇచ్చాడు. భర్త మాటలు గుడ్డిగా నమ్మిన భార్య.. తన కుమార్తెను తీసుకుని వచ్చింది. 

ఓ ఏడాది గడిచిన అనంతరం జయరాంలోని మృగవాంఛ బయటపడింది. కూతురులాంటి ఆమెపై కన్నుపడింది. తల్లి లేని సమయంలో బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం కాస్తా భార్యకు తెలియడంతో బంధువులతో తన గోడును వెళ్లబోసుకుంది. భర్తపై భయం కారణంగా నిలదీయలేక సమీప బంధువుల ఇంటి వద్ద బాలికను ఉంచింది. అప్పటికే రెండో భార్య తీరుతో ఆగ్రహంగా ఉన్న జయరాం బాలికను తన నుంచి దూరం చేయడాన్ని సహించలేకపోయాడు.

వెంటనే ఆమెను తన వద్దకు తీసుకురావాలని భార్యపై ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా వేధింపులకు దిగాడు. భర్త చేష్టలను భరించలేని రెండోభార్య.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే జయరాంపై ఏమాత్రం తీవ్రతలేని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
 

మరిన్ని వార్తలు