హైదరాబాద్‌లో దారుణం.. మాయమాటలు చెప్పి.. యువతిని ఓయో హోటల్‌కు తీసుకెళ్లి..

28 Mar, 2022 15:41 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమీర్‌పేట: ఉద్యోగం ఇప్పిస్తానని యువతిని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ సైదులు వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా కొలిమిగండ్ల మండలానికి చెందిన ఓ కుటుంబం జీవనోపాధి నిమిత్తం నగరానికి వచ్చి చైతన్యపురి కాలనీలో ఉంటున్నారు. ఆ కుటుంబానికి చెందిన 19 ఏళ్ల యువతి టెలీకాలర్‌గా పని చేస్తోంది.

సదరు యువతి ఫోన్‌ నెంబర్‌ సంపాదించిన సిద్ధార్థరెడ్డి అనే యువకుడు ఆమెకు ఫోన్‌ చేసి తన కంపెనీలో ఉద్యోగం ఇచ్చి నెలకు రూ.18 వేల వేతనం ఇప్పిస్తానని నమ్మించాడు. ఈ నెల 9న కారులో దిల్‌సుఖ్‌నగర్‌ వెళ్లి యువతిని తీసుకుని ఎర్రగడ్డకు వచ్చాడు. మార్గమధ్యలో ఫొటోలు, గుర్తింపు కార్డులు, సర్టిఫికెట్ల జిరాక్స్‌ పత్రాలు తీసుకున్నాడు. ఎర్రగడ్డలోని ఓయోలో ఓ గదిని తీసుకుని అందులో దింపాడు.

ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకొచ్చి హోటల్‌కు ఎందుకు తీసుకువచ్చావని ప్రశ్నించగా నియామకపత్రం రావడానికి ఆలస్యమవుతుందని, రాత్రి భోజనం చేశాక నియామకపత్రంతో పాటు కొన్ని డబ్బులు అడ్వాన్స్‌గా ఇస్తానని మాయమాటలు చెప్పాడు. ఆ తర్వాత యువతిపై అత్యాచారం చేసి జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే ఫొటోలు సోషల్‌ మీడియాలో పెడుతానని బెదిరించాడు. హోటల్‌ నుంచి తప్పించుకుని ఇంటికెళ్లిన యువతి జరిగిన విషయాన్ని ఇంట్లో చెప్పి చైతన్యపురి స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు కేసును ఎస్‌ఆర్‌నగర్‌కు బదిలీ చేశారు.    
చదవండి: తొమ్మిది పేజీల సూసైడ్‌ నోట్‌.. ఎనిమిది నెలలుగా లైంగిక సంబంధం..

మరిన్ని వార్తలు