పోలీస్‌ వ్యాన్‌లో బర్త్‌ డే జరుపుకున్న ఖైదీ: వైరల్‌

22 Aug, 2022 11:07 IST|Sakshi

థానే: ఒక ఖైదీ పోలీస్‌ వ్యాన్‌లో బర్త్‌ డే జరుపుకున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో సర్వత్రా పెద్ద ఎత్తున​ విమర్శలు వెలువెత్తాయి. ఈ ఘటన మహారాష్ట్రలో థానే జిల్లాలో చోటుచేసుకుంది. రోషన్‌ ఝూ అనే 28 ఏళ్ల నిందితుడు ఒక కేసు విచారణ కోసం కోర్టు వెలుపల నిరీక్షిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది.

అతను ఒక హత్య కేసులో నిందితుడు, గత నాలుగేళ్లుగా జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ మేరకు పోలీసు వ్యాన్‌లో ఉన్న సదరు నిందితుడు రోషన్‌కి అతని అనుచరులు బర్త్‌ డే కేక్‌ని వ్యాన్‌ విండ్‌ వద్ద నుంచి అందించారు. అతను చక్కగా కేక్‌ కట్‌ చేసి బర్త్‌ డే జరుపుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వాట్సాప్‌ స్టేటస్‌లోనూ, సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పెద్ద దూమరం రేపింది. అయినా ఒక ఖైదీ పోలీసు వ్యాన్‌లో దర్జాగా వేడుకలు జరుపుకుంటుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున్న విమర్శలు వచ్చాయి.

ఐతే జైలు సూపరింటెండెంట్‌ అధికారులు ఆ నిందితుడు కళ్యాణ్‌ అధర్వడి జైలులో ఖైదీగా ఉన్నాడని, కేసు విచారణ విషయమై అన్ని ప్రోటోకాల్స్‌ని అనుసరించే బయటకు తీసుకువచ్చామని చెప్పారు. ఆ నిందుతుడిని కోర్టులో హాజరుపర్చేందుకు ప్రత్యేక ఎస్కార్ట్‌ పోలీసు బృందం తీసుకువెళ్లిందని తెలిపారు. ఆ నిందితుడి కార్యకలాపాలపై ఆ బృందం గట్టి నిఘా ఉంచుతుందని చెప్పారు.

ఇది అధికారులకు చెడ్డపేరు తీసుకురావాలనే దురుద్దేశంతో కావాలని చేసిన పనిగా అధికారులు పేర్కొన్నారు. పైగా ఆ నిందితుడిని తీసుకువెళ్లిన ఎస్కార్ట్‌ బృందాన్ని కూడా విచారిస్తున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అతనిపై వివిధ పోలీస్‌స్టేషన్‌లలో దాడి, హత్యాయత్నం, దోపిడి వంటి ఇతర కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. అంతేగాక 2017లో ఒక కానిస్టేబుల్‌ పై కూడా దాడి చేశాడని చెబుతున్నారు.

(చదవండి: అప్పు తీర్చమన్నందుకు హత్య, ఇద్దరికి జీవితఖైదు )

మరిన్ని వార్తలు