తల్లి మృతదేహాన్ని స్మశానంలోనే వదిలేసిన కొడుకు

20 Apr, 2021 13:33 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్: కరోనా వైరస్‌ సోకిందని ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన సంఘటనలు చూశాం. ఇక కోవిడ్‌తో మరణిస్తే మృతదేహాలను సైతం వదిలివెళ్లిన వార్తలను కూడా విన్నాం. అయితే తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న తల్లి చనిపోతే దహనం చేయకుండా స్మశాన వాటికలో మృతదేహాన్ని వదిలేసి వెళ్లాడు. ఈ ఘటన జిల్లాలోని ప్రగతినగర్ సర్వజనిక్ స్మశాన వాటికలో జరిగింది. ఓ వృద్ధురాలి మృతదేహాన్ని దహన సంస్కారాల కోసం తీసుకొచ్చిన ముగ్గురు వ్యక్తులు స్మశానంలోనే వదిలిపెట్టి వెళ్లిపోయారు. మృతదేహాన్ని స్మశానవాటికలో వదిలేసి కట్టెలు తీసుకు వస్తామని చెప్పిన ముగ్గురు వ్యక్తులు మళ్లీ తిరిగిరాని రాలేదు.

ఎంత సమయం గడిచినా వాళ్లు తిరిగి రాకపోవడంతో స్మశానవాటిక వాచ్‌మెన్‌కి అనుమానం వచ్చిది. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వృద్ధురాలి మృతదేహాన్నిపోలీసులు ఆస్పత్రి మార్చురీకి తరలించారు. స్మశానంలో మృతదేహాన్ని వదిలి వెళ్లిన వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే ఆ ముగ్గురు వ్యక్తుల్లో వృద్ధురాలి కన్న కొడుకు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తన తల్లి కరోనా సోకి మరణించిందనే అనుమానంతో స్మశానంలో మృతదేహాన్ని వదిలివెళ్లినట్లు తెలుస్తోంది. 
చదవండి: ఓఎల్‌ఎక్స్‌ వేదికగా సోఫా కొంటానని..

మరిన్ని వార్తలు