లాడ్జీని బార్‌లా మార్చిన ప్రబుద్ధుడు 

20 Jun, 2021 10:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, రాంగోపాల్‌పేట్‌(హైదరాబాద్‌) : లాక్‌డౌన్‌ సమయం 5 గంటలకు కాగానే మద్యం దుకాణాలు మొత్తం బంద్‌ చేస్తారు. ఆ సమయంలో మందు తాగాలనుకునే వారి కోసం ఏకంగా లాడ్జీనే బార్‌లా మార్చేశాడో ఓ ప్రబుద్ధుడు.  గోపాలపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. నిందితున్ని పోలీసులు అరెస్టు చేసి 117 క్వార్టర్‌ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం... ఖైరతాబాద్‌ డీటీనగర్‌కు చెందిన గంగోలి మురళి (52) గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా దేవి లాడ్జీ నడుపుతున్నాడు. అయితే ఇటీవల కరోనాతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. లాక్‌డౌన్‌తో లాడ్జీ వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. అయితే సాయంత్రం 5 గంటల తర్వాత మందు బాబులకు మందు విక్రయించడంతో పాటు సిట్టింగ్‌ కూడా ఏర్పాటు చేస్తే తన వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతుందని ఆలోచించాడు.

ఇదే తడవుగా 10 రోజుల క్రితం  లాడ్జీలోని గదుల్లో టేబుళ్లు, చైర్లు వేసి నాలుగు రకాల బ్రాండ్‌ల క్వార్టర్‌ బాటిళ్లు తీసుకొచ్చి లాడ్జీని బార్‌లా మార్చేశాడు. అంతేకాకుండా మంచినీళ్లు, తినేందుకు స్టఫ్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇలా గత 10 రోజులుగా మందు బాబులకు లాక్‌డౌన్‌ సమయంలో ఇబ్బందులు లేకుండా చూస్తున్నాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు గోపాలపురం పోలీసులు దాడి చేసి నిందితున్ని అరెస్టు చేశారు. మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు.   

చదవండి: లైంగిక వేధింపులు: శివశంకర్‌ బాబా శిష్యురాలి అరెస్టు..

మరిన్ని వార్తలు