కులాంతర వివాహం.. బంధువుల సమక్షంలో అత్తింటివారు దూషించడంతో..

10 Aug, 2021 20:06 IST|Sakshi
బాధితుడు సాయికుమార్‌

సాక్షి, మిర్యాలగూడ(నల్లగొండ): అట్రాసిటీ కేసు నమోదు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఓ యువకుడు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సోమవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు.. మిర్యాలగూడ పట్టణం గాంధీనగర్‌కు చెందిన గ్యార సాయికుమార్, ఇందిరమ్మకాలనీకి చెందిన సౌజన్యను ఏడాదిన్నర క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజులుగా దంపతుల మధ్య తగాదాలు చోటు చేసుకుంటున్నాయి.

ఈ క్రమంలో సౌజన్య కుటుంబ సభ్యులు సాయికుమార్‌ను బంధువుల సమక్షంలో కులం పేరుతో దూషించారు. ఈ విషయంపై సాయికుమార్‌ తల్లి సైదమ్మ  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్య తీసుకోవాలని కోరుతూ ఈ నెల 6వ తేదీన వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, పోలీసులు కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్నారని సాయికుమార్‌ మనస్తాపం చెందాడు. ఈ నేపథ్యంలోనే సాయంత్రం పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న సాయికుమార్‌ వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బా తెరిచి తాగాడు. గమనించిన పోలీసులు వెంటనే అతడిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సాయికుమార్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు వన్‌టౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు