పాతబస్తీలో యువతి విక్రయం

7 Jan, 2021 02:44 IST|Sakshi

సుడాన్‌ దేశస్తుడికి రూ.2 లక్షలకు అమ్మేసిన దళారి

సాక్షి, చాంద్రాయణగుట్ట: దుబాయిలో నర్సు ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించిన ఓ దళారి చాంద్రాయణగుట్టకు చెందిన యువతిని సుడాన్‌ షేక్‌కు విక్రయించింది. దుబాయిలో నరకం అనుభవిస్తున్న ఆ యువతి ఎంతో కష్టపడి తన కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేసింది. దీంతో ఆ యువతిని భారత్‌కు రప్పించాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు, ఎంబీటీ అధికార ప్రతినిధి అంజదుల్లాఖాన్‌ విదేశీ వ్యవహారాల శాఖకు ఈమెయిల్‌లో విన్నవించుకున్నారు. బండ్లగూడ గౌస్‌నగర్‌ హుందాహిల్స్‌కు చెందిన  నర్సుగా పనిచేసేది. ఈ సమయంలో వట్టెపల్లికి చెందిన ఫాతిమా అనే మహిళకు ఆమె పరిచయమయ్యింది. షార్జాలోని ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తే నెలకు రూ.40 వేలు వస్తాయని, అక్కడ తనకు తెలిసిన వారున్నారని నమ్మించి నూర్జహాన్‌ను గత డిసెంబర్‌ 15న షార్జాకు పంపించింది.

అక్కడ ఆమెను అమ్మర్‌ అహ్మద్‌ ఉమర్‌ అనే వ్యక్తి తన ఇంటికి తీసుకెళ్లాడు. అమ్మర్‌ ఇంట్లో గతంలో ఫాతిమాతో కలిసి ఉండే నజ్మీన్‌ అనే బాలికను నూర్జహాన్‌ చూసింది. మూడు నెలల కాంట్రాక్ట్‌ మ్యారేజ్‌ కింద నజ్మీన్‌ను పంపించినట్లు సదరు యువతికి తెలిసింది. అమ్మర్‌ తాను ఫాతిమాకు రూ.2 లక్షలు చెల్లించినట్టు ఆ యువతికి చెప్పాడు. ఫాతిమాకు అమ్మర్‌ ద్వారా ఫోన్‌ కాల్‌ రావడంతో ఆమె తల్లి వద్దకు వెళ్లి ఆమె ముందు రూ.2 లక్షలు పెట్టి వీడియో తీసి షేక్‌కు పంపించారు. అనంతరం డబ్బు తిరిగి వెనక్కి తీసుకున్నారు. ఈ వీడియా చూసిన అనంతరం ఆ యువతి నాలుగు రోజులపాటు షేక్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురై తాను పడుతున్న నరకాన్ని వాట్సాప్‌ వీడియో ద్వారా కుటుంబ సభ్యులకు వెల్లడించింది. కాగా బాధిత కుటుంబం నుంచి ఇంకా ఫిర్యాదు అందలేదని చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్‌ రుద్ర భాస్కర్‌ ‘సాక్షి’కి తెలిపారు.

మరిన్ని వార్తలు