మృతదేహంతో మూడ్రోజులు సహవాసం

17 Jan, 2021 08:53 IST|Sakshi

పూడ్చి పెట్టేందుకు యత్నించగా వెలుగులోకి..

నాగర్‌కర్నూల్‌ : అనారోగ్యంతో చనిపోయిన మహిళ మృతదేహంతో ఓ వ్యక్తి మూడు రోజుల పాటు సహవాసం చేశాడు. అయితే.. మృతదేహాన్ని పూడ్చిపెట్టే ప్రయత్నం చేస్తుండగా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం అవుసలికుంటలో చోటు చేసుకుంది. తెలకపల్లి మండలం గౌరారం గ్రామానికి చెందిన కృష్ణయ్య తన కూతురు కళమ్మను ఇరవై ఏళ్ల క్రితం అవుసలికుంటకు చెందిన శేఖర్‌తో వివాహం జరిపించారు. పది నెలలకే భర్త చనిపోవడంతో కళమ్మకు నాగనూలుకు చెందిన బాలపీరుతో రెండో వివాహం చేశారు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. కొన్నేళ్ల తర్వాత రెండో భర్త కూడా చనిపోవడంతో ఆమె తల్లిదండ్రుల వద్దే ఉంటుంది.

అయితే.. తండ్రి కృష్ణయ్య ఇటీవల కూతురిని మందలించడంతో అవుసలికుంటలో ఒంటరిగా ఉంటున్న మొదటి భర్త తమ్ముడు లింగస్వామి ఇంటికి వచ్చింది. అప్పటికే అనారోగ్యం పాలైన ఆమె గురువారం మధ్యాహ్నం అకస్మాత్తుగా మృతి చెందింది. దీంతో ఎక్కడ తనపైకి వస్తుందనే భయంతో లింగస్వామి విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్త పడ్డాడు. శనివారం గుడిసె ముందు గుంతను తీసి శవాన్ని పూడ్చి పెట్టేందుకు గ్రామంలో మరో వ్యక్తి సాయం కోరడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతురాలి కుమారుడు మహేశ్‌ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు