నా డబ్బులు నాకు ఇచ్చేయ్‌.. రూ.40 కోసం స్నేహితుడు హత్య

18 Jun, 2021 14:24 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చెన్నై: క్షణికావేశానికి లోనైన ఓ వ్యక్తి సొంత స్నేహితుడినే హత్య చేశాడు. మద్యం మత్తులో జరిగిన గొడవ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ దారుణ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. చెన్నై మాధవరం ఉడయార్‌ తోట 1వ వీధికి చెందిన ఆర్ముగం కుమారుడు మణి అలియాస్‌ మణికంఠన్‌ (25), అదే ప్రాంతానికి చెందిన నాగముత్తు స్నేహితులు. వీరిద్దరూ ఒకచోట కలుసుకొని బుధవారం రాత్రి మద్యం సేవించారు. అనంతరం నాగ ముత్తు మద్యం తాగడానికి ఇచ్చిన రూ.40 తిరిగి ఇవ్వమని మణికంఠన్‌ను అడిగాడు.

దీనికి అతను నిరాకరించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన నాగముత్తు మాంసం దుకాణంలోకి చొరబడి కత్తిని తీసుకొచ్చాడు. నా డబ్బులు నాకు ఇచ్చేయ్‌ అంటూ ఆవేశంతో మణికంఠన్‌పై దాడి చేశాడు. తీవ్ర రక్తస్త్రావం కావడంతో మణికంఠన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

చదవండి: ఫేస్‌బుక్‌ పరిచయం.. మోడలింగ్‌ చాన్స్‌ ఇప్పిస్తానని చెప్పి.. ఆపై

మరిన్ని వార్తలు