సాక్షి, హైదరాబాద్(నార్సింగి): నగరంలో కలకలం రేపిన సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై దాడి ఘటనకు సంబంధించి మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. నిందితుడు షారూఖ్ హర్యానాకు చెందిన వాడు అని, రెండేళ్లుగా బాధితురాలితో అతడికి పరిచయం ఉందని తెలిపారు. అయితే కొన్ని రోజుల నుంచి ఇద్దరి మధ్య దూరం పెరిగిందని, అతడి వేధింపులు ఎక్కువకావడంతో బాధితురాలు షీ టీమ్కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో షీ టీం షారూఖ్కు కౌన్సెలింగ్ ఇచ్చిందని డీసీపీ తెలిపారు. ఈ నేపథ్యంలో బాధిత యువతిపై కక్ష గట్టిన నిందితుడు ఆమెపై దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. షారూఖ్కు గతంలోనే పెళ్లైందని, భార్య నుంచి విడిపోయిన అతడు విడాకులు తీసుకున్నట్లు డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.
కాగా ప్రముఖ ఐటీ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న మహబూబ్నగర్ జిల్లాకు చెందిన యువతిపై షారుఖ్ కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే హైదర్షాకోట్లోని ఆమె నివాసానికి వెళ్లి ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. కాగా జావెద్ హబీబ్ సెలూన్లో పనిచేస్తున్న షారూఖ్ ప్రేమ పేరిట బాధితురాలి వెంటపడ్డాడు. అయితే యువతికి ఈ ఏడా ది మేలో పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పా ట్లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న షారూఖ్.. తనతోనే ఉండాలంటూ ఆ యువతిపై ఒత్తిడి చేశాడు. ఆమె అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకుని దారుణానికి ఒడిగట్టాడు.