నా కోసం నీ ప్రేమను త్యాగం చెయ్‌.. లేకపోతే..

9 Apr, 2021 10:14 IST|Sakshi

ప్రేమ విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ 

బ్లేడ్‌తో దాడి చేసిన యువకుడు 

సాక్షి, బంజారాహిల్స్‌: ‘నువ్వు ప్రేమిస్తున్న నీ మేనకోడలిని నేను ప్రేమిస్తున్నా.. నా కోసం నీ ప్రేమను త్యాగం చేయ్‌... లేకపోతే బాగుండదు’ అంటూ స్నేహితుడికి ఓ యువకుడు మెసేజ్‌ పెట్టాడు. దీంతో ఆగ్రహానికి గురైన స్నేహితుడు బ్లేడ్‌తో ఆ యువకుడి మెడపై గాట్లుపెట్టాడు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితుడికి తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రైమ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, బ్లేడ్‌తో దాడి చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు... రహ్మత్‌నగర్‌ బంగారు మైసమ్మ టెంపుల్‌ వద్ద నివసించే సాయి చైతన్య(19) ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అదే ప్రాంతంలో నివసిస్తున్న తన అక్క కూతురు(17)ను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాడు. తమ ఇద్దరి ప్రేమకు సహకరించాల్సిందిగా స్నేహితులైన ఇద్దరు బాలురు (17)ను సాయిచైతన్య కోరాడు.

అయితే, వారు చైతన్యను మోసగించి ఆ యువతితో ప్రేమాయణం నడిపిస్తున్నారు. అంతేకాకుండా నీ ప్రేమను త్యాగం చేయాలంటూ రెండు రోజుల క్రితం సాయి చైతన్యకు వాట్సాప్‌ మెసేజ్‌ పెట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన చైతన్య ఎల్‌ఆర్‌ కిషోర్‌ స్కూల్‌ సమీపంలోని గ్రౌండ్‌కు వస్తే తేల్చుకుందామని వారిని హెచ్చరించాడు. దీంతో స్నేహితులతో పాటు చైతన్య గ్రౌండ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. సాయిచైతన్య తన వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో స్నేహితుల్లోని ఓ బాలుడి మెడపై గాట్లు  పెట్టాడు.  తీవ్ర రక్తస్రావంతో విలవిల్లాడుతున్న బాధితుడిని ఆస్పత్రిలో చేర్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సాయి చైతన్యపై ఐపీసీ సెక్షన్‌ 307 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. తనను చంపేస్తానని బెదిరించడంతో ముందుగానే స్నేహితుడిని చంపేందుకు పథకం వేసి బ్లేడ్‌తో దాడి చేశానని నిందితుడు  చైతన్య తెలిపాడు.  

చదవండి: బంజారాహిల్స్‌: ప్రేమిస్తావా.. చస్తావా.. చావాలా.. !
ఓయో రూమ్‌ తీసుకుందామనుకుంటే.. అంతలోనే!
 

మరిన్ని వార్తలు