దొంగతనం కోసం వెళ్తే చివరికి ఎముకలే మిగిలాయి..

22 Mar, 2021 10:20 IST|Sakshi

కారు డ్రైవర్‌ దారుణ హత్య 

నాంపల్లి: ఈ నెల 5న అదృశ్యమైన ఓ కారు డ్రైవరు బీదరు అడవుల్లో శవమయ్యాడు. కుటుంబసభ్యులకు శవం కాకుండా ఎముకలు మాత్రమే లభించాయి. చెట్ల పొదల్లో లభ్యమైన శవాన్ని అడవి పందులు పీక్కు తిన్నాయి. అంత్యక్రియలకు  ఎముకలు తప్ప ఏ ఇతర శరీర భాగాలు దొరకలేదు. చివరకు వాటినే తెచ్చి అంత్యక్రియలు చేశారు. ఈ విషాదకరమైన సంఘటన నాంపల్లి పోలీసు స్టేషన్‌లో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ ఖలీల్‌ పాషా తెలిపిన మేరకు..  ఢిల్లీకి చెందిన శివకుమార్‌(28), బీదర్‌కు చెందిన ఇంతియాజ్‌ ఖనమ్‌ (24) ఫేస్‌బుక్‌లో ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకొని ఢిల్లీకి మకాం మార్చారు. ఉపాధి కోసం నేరాలబాట పట్టారు. ఈ నెల 4న రైలులో హైదరాబాదుకు చేరుకున్నారు.

అఫ్జల్‌గంజ్‌లోని శ్రీసాయి లాడ్జిలో బస చేశారు. కార్లను అద్దెకు తీసుకుని స్క్రాబ్‌కు వేసి సొమ్ముచేసునేందుకు పథకాన్ని రచించారు.  ఈ నెల 5న నాంపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో ఓ కారును అద్దెకు తీసుకున్నారు. డ్రైవర్‌ అస్లం ఖాన్‌(48)తో కలిసి బీదర్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో రవి అనే స్నేహితుడిని శివకుమార్‌ కారులో తీసుకెళ్లారు. మణ్యకెళ్లి అడవిలో డ్రైవర్‌ వెనుక సీటులో కూర్చున్న శివకుమార్‌ వైరుతో డ్రైవర్‌ అస్లం ఖాన్‌ గొంతుకు వేసి బిగించి హత్యచేశారు. ఇందుకు రవి, ఇంతియాజ్‌ ఖనమ్‌ సహకరించారు. మృతదేహాన్ని చెట్ల పొదల్లో వదలి నిందితులు కారును బీదరులోని ఓ స్క్రాబ్‌ దుకాణం యజమానికి రూ.14వేలకు అమ్మేశారు. తిరిగి నగరానికి వచ్చారు.

నాంపల్లి టిప్పుఖాన్‌ సరాయిలో నివాసం ఉండే అస్లం ఖాన్‌ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ కెమెరాలు, లాడ్జిలో లభించిన ఆధారాలను సేకరించిన పోలీసులు చివరికి ఎంజీబీఎస్‌ దగ్గర నిందితులను అదుపులోకి తీసుకున్నారు.నేరాన్ని చేసినట్లుగా విచారణలో ఒప్పుకోవడంతో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.  

మరిన్ని వార్తలు