నిర్లక్ష్యం ఎవరిది? చూస్తుండగానే గాల్లో కలిసిన ప్రాణాలు..

23 May, 2021 18:26 IST|Sakshi

సాక్షి, జన్నారం(ఖానాపూర్‌): అతివేగం ప్రమాదానికి దారి తీస్తుంది. ఒక్కోసారి మృత్యువూ కబళిస్తుంది. అతివేగంగా దూసుకువస్తున్న మోటార్‌సైకిల్‌ను ఆపాలని చెక్‌పోస్టు వద్ద అధికారులు సూచించినా ఆగకుండా వెళ్లడం వల్లే ప్రమాదం సంభవించి వెనుక కూర్చున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన ఘటన తెలిసిందే. లక్సెట్టిపేట మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన సుదగోని వెంకటేశ్‌గౌడ్‌(32) శనివారం తపాలపూర్‌ అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద చెక్‌పోస్టు గేట్‌కు ఢీకొని మృతిచెందిన వీడియో వైరల్‌గా మారింది.

వేగంగా వస్తున్న మోటార్‌సైకిల్‌ను ఆపాలని చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న బీట్‌ అధికారి చేతితో సూచించినా ఆగలేదు. అతివేగంగా వస్తుండడాన్ని గమనించి గేట్‌ను ఎత్తే ప్రయత్నం చేస్తుండగా వాహన చోదకుడు క్షణాల్లో గేట్‌ను దాటి పోవాలని ప్రయత్నించాడు. వాహనం నడిపే వ్యక్తి ముందుకు వంగడంతో వెనుక కూర్చన్న వెంకటేశ్‌గౌడ్‌ గేట్‌కు ఢీకొని తలకు తీవ్ర గాయలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ వీడియో ఆదివారం వైరల్‌ అయింది. అతివేగంగా నడిపిన చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుసూదన్‌రావు తెలిపారు.

>
మరిన్ని వార్తలు