ఇన్‌స్టా పరిచయం.. పోలీస్‌ స్టేషన్‌లో పంచాయితీ

1 Mar, 2021 08:21 IST|Sakshi

మంచిర్యాలక్రైం: వారిద్దరికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. యువతీ, యువకుడి పరిచయం కాస్త స్నేహంగా మారి.. చివరికి పోలీస్‌స్టేషన్‌కు చేరిన సంఘటన జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగు చూసింది. యువకుడి తల్లి రాధ తెలిపిన కథనం ప్రకారం.. భూపాలపల్లికి చెందిన ఓరుగంటి ఉదయ్‌కిరణ్‌ మంచిర్యాలలోని హైటెక్‌ సిటీలో గిటార్‌ నేర్పిస్తుంటాడు. అతడికి ఇన్‌స్ట్ర్రాగ్రామ్‌లో ఓ యువతితో పరిచయం అయింది. వాళ్లిద్దరు కొంత కాలంగా వాట్సాప్‌ మెస్సేజ్, ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్‌ చేసుకోవడంతో పాటు ఫోన్‌కాల్స్‌ మాట్లాడుకున్నారు. గత నెల 17న సదరు యువతి ఇంటికి రమ్మని తన కొడుకుని ఆహ్వానించిందని ఉదయ్‌కిరణ్‌ తల్లి రాధ ఆరోపిస్తోంది.

ఇంటికి వెళ్లిన ఉదయ్‌కిరణ్‌తో యువతి సెల్ఫీలు కూడా దిగిందని అనంతరం తన మేనమామలు, తమ్ముడు, అమ్మతో కలిసి ఉదయ్‌కిరణ్‌ను బంధించి పెళ్లి చేసుకోవాలని బెదిరించడమే కాకుండా దాడి చేయించిందని ఆరోపించింది. అనంతరం ఉదయ్‌కిరణ్‌ను పోలీసులకు అప్పగించారని, పోలీసులకు తాను ఫిర్యాదు చేస్తే తిరస్కరిస్తున్నట్లు రాధ పేర్కొంది. ఈ విషయమై సీఐ ముత్తి లింగయ్యను వివరణ కోరగా ఉదయ్‌కిరణ్‌ తల్లి రాధ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. సదరు యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉదయ్‌కిరణ్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. 

చదవండికొత్త నిబంధనలతో పెళ్లిళ్ళు సాధ్యమయ్యేనా?

మరిన్ని వార్తలు