కూతురు ఫోన్‌ రికార్డుతో బయటపడ్డ మర్డర్‌ స్కెచ్‌

5 Sep, 2020 20:00 IST|Sakshi

సాక్షి, తూర్పు గోదావరి : భార్య ఉండగానే వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తికి తగిన శాస్తి జరిగింది. మహిళతో అక్రమ సంబంధానికి ఆమె భర్త అడ్డుగా ఉన్నాడని హత్య చేయాలని పథకం రచించాడు. తూర్పుగోదావరి జిల్లా మండపేట పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మండపేట సంఘం కాలనీకి చెందిన మహిళతో సతీష్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం కాస్తా ఆమె భర్తకు తెలియడంతో పలుమార్లు ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో అడ్డుగా ఉన్న ఆమె భర్తను తొలగించుకోవాలని కుట్ర పన్నాడు. దీని కోసం అతని స్నేహితుడు ప్రతాప్ సాయం కోరాడు. అతని సలహా మేరకు ఆహారంలో స్లో పాయిజన్ ఇచ్చేందుకు  పథకానికి ప్రణాళిక రచించాడు. దీనికి మహిళ కూడా ఓకే చెప్పడంతో హత్య చేయాలని భావించాడు. 

అయితే తల్లి వ్యవహారంపై అప్పటికే అనుమానం వచ్చిన చిన్న కూతురు ఆమె ఫోన్ కాల్స్‌‌ రికార్డు చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే హత్య పథకం బయటపడింది. తండ్రిని హత్య చేసేందుకు సతీష్‌తో కలిసి భార్య కుట్ర పన్నిందన్న విషయం తెలిసి భర్త షాకయ్యాడు. అనంతరం మహిళ భర్త మండపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు.. సతీష్‌పై ఐపీసీ 307, 328 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. ఈ పథకంలో ప్రధాన పాత్రదారులైన సతీష్, ప్రతాప్‌లను నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు