గంజాయి మత్తులో యువకుల హల్‌చల్‌

7 Aug, 2020 10:55 IST|Sakshi
 పోలీస్‌ సిబ్బందిపై దాడి చేస్తున్న యువకులు ,కర్ర పట్టుకుని ఠాణాలోకి వెళ్తున్న యువకుడు 

కొత్తగూడెంఅర్బన్‌: పండ్ల వ్యాపారం చేసే యువకులు గంజాయి, మద్యం మత్తులో కొత్తగూడెం పట్టణంలో గురువారం బీభత్సం సృష్టించారు. అడ్డొచ్చిన వారిపై కర్రలు, కత్తులతో బెదిరింపులకు దిగారు. ఆపడానికి వచ్చిన ట్రాఫిక్‌ పోలీసులపై సైతం దాడి చేశారు. స్థానికులు, త్రీటౌన్‌ సీఐ, ట్రాఫిక్‌ పోలీసుల కథనం ప్రకారం... కూరగాయలు, పండ్ల కొనుగోలుకు చుంచుపల్లి మండలానికి చెందిన ఓ మహిళ గురువారం రైతుబజార్‌కు రాగా, పండ్ల వ్యాపారులు అసభ్యంగా మాట్లాడారు. ఆమె భర్తకు విషయం తెలియజేయడంతో, అతను వచ్చి వ్యాపారులను నిలదీశాడు.

ఈ క్రమంలో వ్యాపారులు, అతనికి మధ్య గొడవ జరిగింది. మద్యం, గంజాయి మత్తులో పండ్ల వ్యాపారితోపాటు మరో ముగ్గురు యువకులు కలిసి మహిళ భర్తపై కర్రలు, కత్తులతో దాడికి యత్నించారు. దీంతో అతను పరుగులు తీస్తూ సూపర్‌బజార్‌ మీదుగా ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌లోకి వెళ్లాడు. ఆ యువకులు కూడా స్టేషన్‌లోకి రాగా, ట్రాఫిక్‌ పోలీసులపై అడ్డుకున్నారు. దీంతో వారిపై కూడా దాడి చేశారు. ట్రాఫిక్‌ పోలీస్‌ చేతిని కొరికి గాయపరిచారు. సమాచారం అందుకున్న త్రీటౌన్‌ సీఐ ఆదినారాయణ ట్రాఫిక్‌ ఠాణాకు  చేరుకుని, నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు వారిపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

మరిన్ని వార్తలు