తహసీల్దారుపై పెళ్లి బృందం దాడి 

9 May, 2021 15:07 IST|Sakshi

పర్లాకిమిడి: నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఊరేగింపును అడ్డుకున్న తహసీల్దారుపై పెళ్లి బృందం దాడికి పాల్పడింది. ఈ ఘటన జిల్లాలోని ఛెలిగడ గ్రామంలో శుక్రవారం జరిగింది. ఈ ఘటనలో తహసీల్దారు సృతిరంజన్‌ శతపతి, ఎస్పైలు ముఖేష్‌ లక్రా, హేమంత్‌ సెధి, మరో నలుగురు కానిస్టేబుల్స్‌ గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆర్‌.ఉదయగిరి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో అడ్మిట్‌ చేశారు. విషయం తెలుసుకున్న సబ్‌డివిజన్‌ పోలీస్‌ అధికారి దిలీప్‌కుమార్‌ సంఘటనాస్థలికి చేరుకొని నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయినట్టు తెలిసింది.

అధికారులపై దాడి చేసిన నిందితులను తప్పకుండా అరెస్ట్‌ చేస్తామని ఉన్నతాధికారులు విలేకరులతో చెప్పారు. సబ్‌ కలెక్టర్‌ సంగ్రాం కేసరి పండా అక్కడికి వచ్చి తహశీల్దారుతో చర్చించారు. నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని ఎస్‌డీపీవోను ఆదేశించారు.

మరిన్ని వార్తలు