పెళ్లైన యువకుడి నిర్వాకం.. బిడ్డకు జన్మనిచ్చిన..

25 Mar, 2022 08:09 IST|Sakshi
రాజేష్‌ నాయక్‌ (ఫైల్‌)

ఇంట్లో చెబితే వీడియోలు, ఫొటోలు వైరల్‌ చేస్తానని బెదిరింపులు 

సాక్షి, చిత్తూరు(రొంపిచెర్ల): పదో తగరతి విద్యార్థిని ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఘటన రొంపిచెర్ల మండలంలో చోటుచేసుకుంది. ఇద్దరు బిడ్డల తండ్రి ఈ నిర్వాకానికి కారణంగా తెలుస్తోంది. వివరాలివీ.. మండలంలోని బొమ్మయ్యగారిపల్లె పంచాయతీకి చెందిన విద్యార్థిని రొంపిచెర్లలోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. కరోనా నేపథ్యంలో ఏడాది క్రితం కొద్ది రోజులు రొంపిచెర్లలోని తన పెద్దనాన్న ఇంట్లో ఉంది.

అక్కడ ఎలక్ట్రీషియన్‌ పనికోసం వచ్చిన పీలేరు మండలంలోని ఎర్రగుంటపల్లెకు చెందిన చంద్రానాయక్‌ కుమారుడు రాజేష్‌నాయక్‌(34) విద్యార్థినితో పరిచయం పెంచుకున్నాడు. విద్యార్థిని రోజూ ఇంటి దగ్గర నుంచి పాఠశాలకు రెండు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తుండేది. ఈ క్రమంలో బాలికను రోడ్డు పక్కనే ఉన్న చెరువు దగ్గరికి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అ సమయంలో వీడియోలు, ఫొటోలు తీశాడు. విషయం తల్లిదండ్రులకు చెబితే వైరల్‌ చేస్తానని బెదిరించాడు. దీంతో బాలిక ఏమీ చేయ లేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. ఆ తర్వాత  బెదిరింపులతో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

చదవండి: (వదినతో వివాహేతరం సంబంధం.. అన్నకు తెలిసి..)

ఈ క్రమంలోనే కడుపునొప్పిగా ఉందంటూ పది రోజులుగా పాఠశాలకు వెళ్లడం మానేసింది. బుధవారం చికిత్స నిమిత్తం రొంపిచెర్లలోని ఒక ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు విద్యార్థిని గర్భం దాల్చినట్లు నిర్ధారించడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. అప్పుడే నొప్పులు అధికం కావడం, మగ బిడ్డకు జన్మనివ్వడం జరిగిపోయాయి. ఈ మేరకు గురువారం సాయంత్రం విద్యార్థిని ఫిర్యాదుతో రొంపిచెర్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రాజేష్‌కు ఇదివరకే వివాహం కాగా.. ఇద్దరు పిల్లలు ఉండడం గమనార్హం.  

మరిన్ని వార్తలు