పెళ్లైన తర్వాత.. ప్రియుడితో ఫోన్‌కాల్స్‌.. చాటింగ్‌..

11 Aug, 2021 09:57 IST|Sakshi

సాక్షి, జీడిమెట్ల: వివాహితను ఆమె మాజీ ప్రియుడు దారుణంగా హత్య చేసిన ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. సీఐ కె.బాలరాజు చెప్పిన వివరాల ప్రకారం.. ఝార్ఖండ్‌ రాష్ట్రం ధన్‌బాద్‌కు చెందిన పూజ (21)కు అదే ప్రాంతంలోని రాజేంద్రన్‌ వర్మతో ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహమైంది. ఈ దంపతులు కొన్నిరోజుల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. జీడిమెట్ల డివిజన్‌ వినాయకనగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. పూజ నగరానికి వచ్చిన తర్వాత.. గతంలో తాను ప్రేమించిన రాకేష్‌ అనే యువకుడితో ప్రతిరోజు ఫోన్‌లో మాట్లాడుతుండేది. ఆమె హైదరాబాద్‌లో ఉంటున్న విషయం తెలుసుకున్న రాకేష్‌ మరో యువకుడితో కలిసి ధన్‌బాద్‌ నుంచి మంగళవారం ఉదయం 11 గంటలకు జీడిమెట్లలోని పూజ ఉంటున్న ఇంటికి చేరుకున్నారు.

రాకేష్‌ ఆమెతో కొద్దిసేపు మాట్లాడాడు. తనతో ధన్‌బాద్‌ రావాలని పట్టుబట్డాడు. పూజ అందుకు నిరాకరించింది. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణను గమనిస్తున్న అదే ఇంటిలో ఉన్న రింకు ఆపేందుకు ప్రయత్నించగా.. అడ్డువస్తే నీ కుమారుడిని చంపేస్తానని రాకేష్‌ బెదిరించాడు. అనంతరం రాకేష్‌తో ఝార్ఖండ్‌ నుంచి వచ్చిన యువకుడు పూజ కాళ్లను అదిమి పట్టుకున్నాడు. రాకేష్‌ దిండుతో ఆమె ముఖంపై పెట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. ఆ తర్వాత నిందితులిద్దరూ అక్కణ్నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పూజ భర్త రాజేంద్రన్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందం గాలిస్తోంది. 

మరిన్ని వార్తలు