ఫిరంగిపురం(గుంటూరు జిల్లా): ఓ యువకుడి వేధింపులతో మనస్తాపానికి గురైన వివాహిత ఉరివేసుకొని మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ప్రకాశం పంతులు నగర్కు చెందిన మేడా ఏడుకొండలు, లక్ష్మీతిరుపతమ్మ భార్యాభర్తలు. లక్ష్మీతిరుపతమ్మను కొంతకాలంగా వి.తిరుపతయ్య అనే యువకుడు వెంటపడుతూ వేధిస్తున్నాడు.
ఈక్రమంలో ఏడుకొండలు ఈవిషయాన్ని కులపెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో వారు తిరుపతయ్యను పిలిచి మందలించారు. కాగా మంగళవారం రాత్రి భర్త ఏడుకొండలు లేని సమయంలో లక్ష్మీతిరుపతమ్మతో తిరుపతయ్య అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ సమయానికి ఇంటికి వచ్చిన భర్త ఏడుకొండలు గొడవకు దిగడంతో ఆగ్రహానికి గురైన తిరుపతయ్య సీసాతో ఏడుకొండలు తలపై కొట్టాడు.
చుట్టుపక్కల వారు రావడంతో అక్కడి నుంచి పారిపోయాడు. చికిత్స కోసం ఏడుకొండలు వైద్యశాలకు వెళ్లాడు. దీనిపై మనస్తాపానికి గురైన లక్ష్మీతిరుపతమ్మ(27) ఉరివేసుకొని మృతి చెందింది. తిరుపతయ్య అవమానించినందులకు తన భార్య మనస్తాపానికి గురై ఉరివేసుకొని మృతి చెందిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతురాలి భర్త ఏడుకొండలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం.లక్ష్మీనారాయణరెడ్డి తెలిపారు.
చదవండి: పైకి మసాజ్ సెంటర్లు.. లోపల షాకింగ్ దృశ్యాలు.. స్పా ముసుగులో..