పెళ్లయిన 3 నెలలకే..!  

8 Aug, 2020 09:08 IST|Sakshi
ఫ్యాన్‌కు వేలాడుతున్న అపర్ణ మృతదేహం 

వివాహిత ఆత్మహత్య..! 

ఇది ముమ్మాటికి హత్యే: బాధిత తల్లిదండ్రులు 

కేసు నమోదు చేసిన రాయిఘర్‌ పోలీసులు

సాక్షి, ఒడిశా: నవరంగపూర్‌ జిల్లాలోని రాయిఘర్‌ సమితిలో ఉన్న సొరగులి(డీఎన్‌కే) గ్రామంలో వివాహిత అపర్ణ ఫ్యాన్‌కు ఉరేసుకుని గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న రాయిఘర్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం వివాహిత మృతదేహాన్ని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. 

వివరాలిలా ఉన్నాయి..  
సరిగ్గా 3 నెలల క్రితం సొరగులి గ్రామానికి చెందిన జయంత్‌ మండల్‌తో ఝోరిగాం సమితిలోని చటిగుడ గ్రామానికి చెందిన అపర్ణ సర్దార్‌(19) ప్రేమవివాహం జరిగింది. ఈ వివాహం యువకుడి కుటుంబీకులకు ఇష్టం లేకపోయినా.. అపర్ణ అక్క అత్తవారిల్లు కూడా అదే గ్రామం కావడంతో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఒకే ఊరిలో ఉంటారని అపర్ణ తల్లిదండ్రులు సంతోషించారు. అయితే భోజనం చేసిన తర్వాత రాత్రి పడుకునే ముందు అపర్ణకు ఆమె భర్తకు మధ్య ఏదో విషయమై గొడవ జరిగగా, ఇదికాస్త పెరిగి పెద్దదైందని, దీంతో మనస్తాపం చెందిన ఆమె అదే ఇంట్లోని ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుంది.

ఉదయం లేచి చూసిన జయంత్‌కు తన పక్కన తన భార్య లేకపోవడంతో ఆందోళన చెందిన అతడు ఇళ్లంతా వెతికి చూశాడు. ఈ క్రమంలో పక్క గదిలోని ఫ్యాన్‌కు ఆమె మృతదేహం వేలాడుతుండడాన్ని గమనించి, ఆశ్చర్యపోయాడు. అనంతరం ఈ విషయం అపర్ణ తల్లిదండ్రులకు తెలియజేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న బాధిత కుటుంబ సభ్యులు కూతురి మృతదేహంపై పడి రోదించారు. కట్నం కోసమే తమ కూతురును అల్లుడు, అతడి తల్లీదండ్రులు చంపి ఉంటారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇది ముమ్మాటికే హత్యేనని వారు అంటున్నారు. ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందిత భర్తను అదుపులోకి తీసుకుని, విచారణ సాగిస్తున్నారు. 

మరిన్ని వార్తలు