ఇంటి నిర్మాణంపై వివాదం: పెళ్లి రోజే విషాదం

24 May, 2021 06:36 IST|Sakshi
శిరీష, అశోక్‌గౌడ్‌ (ఫైల్‌)

జగద్గిరిగుట్ట: వాళ్లది ప్రేమ వివాహం... ఆదివారం వాళ్ల పెళ్లిరోజు.. ఉదయం దేవుడిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం ఇంటి విషయంమై మాట్లాడుకున్నారు.. ఇంతలో ఏమైందో ఏమో..! ఆ ఇల్లాలు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ దుర్ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విషాదాన్ని నింపింది. పోలీసులు.. స్థానికుల కథనం ప్రకారం ఇందుకు సబంధించిన వివరాలిలా ఉన్నాయి. జగద్గిరిగుట్ట రాజీవ్‌ గృహకల్ప సముదాయంలోని 20వ బ్లాక్‌లో నివాసముంటున్న అశోక్‌ గౌడ్‌ ఆర్టీసీ జీడిమెట్ల డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు.

ఆయన భార్య శిరీష అలియాస్‌ శివ జ్యోతి(28). వారిది ప్రేమ వివాహం. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అందరూ 10 సంవత్సరాలలోపు వారే. నారాయణపేటకు చెందిన శిరీష, మక్తల్‌కు చెందిన అశోక్‌గౌడ్‌లు ఆరేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఆదివారం పెళ్లి రోజు కావడంతో ఉదయం దైవ దర్శనం కూడా చేసుకున్నారు. కొంత కాలంగా రాజీవ్‌ గృహకల్పలో అదనపు గదుల నిర్మాణం జరుగుతోంది. ఈ విషయమై రెండుమూడు రోజులుగా దంపతులు చర్చించుకుంటున్నారు.

అందరూ గదులు కట్టుకుంటున్నారు.. మనం కూడా పక్కకు జరిగి కట్టుకుందామని శిరీష తన భర్త అశోక్‌తో చెప్పింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా మాటామాట పెరిగింది. మధ్యాహ్నం అశోక్‌ లాక్‌డౌన్‌ మూలంగా బస్సులు నడవకపోవడంతో జీడిమెట్ల డిపోలో సంతకం చేడయానికి కార్యాలయానికి వెళ్లారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేక పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన శిరీష ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి రోజే భార్య చనిపోవడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. 
చదవండి: కట్టు తప్పాడని.. కడతేర్చిన తల్లి..ఇంటి ఆవరణలోనే...!

మరిన్ని వార్తలు