మొన్ననే వివాహం.. ప్రియుడితో కలిసి ఆత్మహత్యాయత్నం.. ప్రియురాలు మృతి

23 May, 2023 13:02 IST|Sakshi

హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రియుడు

మృతురాలికి ఈనెల 11న మరో అబ్బాయితో వివాహం

19న హన్మకొండలో ప్రియుడిని కలిసి పాయిజన్ తీసుకున్న జంట

ఎంజిఎంలో చికిత్స పొందుతూ ప్రియురాలు మానస మృతి

సాక్షి న్యూస్ వరంగల్:  ప్రేమ... పెళ్ళి... ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ప్రేమించిన యువకుడిని కాదని మరో అబ్బాయితో పెళ్లి చేసుకున్న యువతి, చివరకు ప్రియుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. యువతి వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా ప్రియుడు హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రేమించిన విషయం ముందే చెప్పి ఉంటే మరో అబ్బాయికి ఇచ్చి పెళ్ళి చేసే వాళ్ళం కాదంటున్నారు మృతురాలి బంధువులు.

భీమదేవరపల్లి మండలం గొల్లపల్లికి చెందిన సంఘ లింగయ్య-రాజేశ్వరి దంపతుల కుమార్తె. మానస అదే మండలంలోని కొత్తకొండకు చెందిన విజయ్ ప్రేమించుకున్నారు. ప్రేమ వ్యవహారం తెలియక పెద్దలు మానస కు హుస్నాబాద్ మండలానికి చెందిన అబ్బాయితో ఈనెల 11న వివాహం జరిపించారు. పెద్దలు కుదిర్చిన పెళ్ళిని కాదనలేక, ప్రియుడిని వదులుకోలేక మానసిక ఆందోళన చెందిన మానస 19న హన్మకొండలో ప్రియుడిని కలిసి మూడుముళ్ళ బంధంతో ఏడడుగులు నడవలేక పోయినా కలిసి చనిపోవాలనుకున్నారు. ఇద్దరు పాయిజన్ తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రియురాలు మానస వరంగల్ ఎంజీఎంలో  చికిత్స పొందుతు చివరకు ప్రాణాలు కోల్పోయారు.

ప్రేమించిన విషయం ముందే చెప్పి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదంటున్నారు మృతురాలి కుటుంబ సభ్యులు. ప్రేమించిన విషయం చెప్పలేదని, చెప్పిఉంటే మరో  అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసే వాళ్ళం కాదని తెలిపారు.
- లింగయ్య, మృతురాలి తండ్రి

కులాలు వేరు కావడంతో ప్రేమ పెళ్ళికి పెద్దలు అంగీకరించలేదని ప్రచారం జరుగుతుంది. ప్రేమ గురించి మానస పెద్దలకు చెప్పినప్పటికీ  యాదవ వర్గాని చెందిన అమ్మాయిని పద్మశాలి వర్గానికి చెందిన ప్రియుడికి ఇచ్చి వివాహం చేయలేకనే తమ కులానికి చెందిన మరో అబ్బాయితో పెళ్ళి జరిపించినట్లు ప్రియుడి బందువులు తెలిపారు. ప్రియుడు ప్రస్తుతం హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు. 

మరిన్ని వార్తలు