సాక్షి, చెన్నై: మోడలింగ్ చేస్తున్న యువతిపై ప్రియుడితో సహా ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన తమిళనాడులో కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు తిరువళ్లూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పూరంబాక్కంలోని శీయంజేరి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ విజయ్ కుమార్కు(19) కాకలూరు బైపాస్లో నివాసం ఉండే మోడలింగ్ యువతి(26)తో పరిచయం ఆరు నెలల కిత్రం ఏర్పడింది.
స్నేహం కాస్తా ప్రేమకు దారి తీసింది. అయితే యువతికి ఇంతకుముందే పెళ్లి అవ్వగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం భర్తకు దూరంగా ఉంటోంది. భర్తకు విడాకులు ఇచ్చి తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు విజయ్కు చెప్పింది. రెండు రోజుల క్రితం(ఆదివారం) షాపింగ్కు తీసుకెళ్లి చీర కొనిస్తానని చెప్పిన విజయ్.. శీయంజేరిలోని తన ఇంటికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా తన సోదరుడికి యాక్సిడెండ్ అయ్యిందని అబద్దం చెప్పి ఆమెను ఇంట్లోనే ఒంటరిగా వదిలేసి బయటకు వెళ్లాడు.
యువతి ఒంటరిగా ఉన్న సమయంలో విజయకుమార్ తన ఇద్దరు స్నేహితులను ఇంటికి పంపించాడు. సామ్రాజ్)27), సతీష్(27) అనే ఇద్దరు వ్యక్తులు సైతం ఆమెపై అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని బయటకు చెబితే హత్య చేస్తామని బెదిరించారు. ఏదో విధంగా అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు తనపై జరిగిన అత్యాచారంపై ఆదివారం సాయంత్రం పుల్లరంబాక్కం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విజయ్, సామ్రాజ్, సతీష్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీరికి 14 రోజులు రిమాండ్ విధించడంతో పుళల్ జైలుకు తరలించారు.